సోషల్ మీడియాలో అతి చేసారో అంతే సంగతి .. వీరినైతే అస్సలు వదిలిపెట్టేలా లేరుగా..!
పహల్గాం దాడి తర్వాత దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలకు కేంద్రం సిద్దమయ్యింది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ రెండు మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ లేఖ రాసింది.

action plan on social media
పహల్గాం ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. ఇప్పటికే ఈ దాడితో సంబంధమున్న పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది. అలాగే భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నా పాకిస్థాన్ యుట్యూబ్ ఛానల్స్ పై నిషేదం విధించింది. ఇప్పుడు భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్రం చర్యలకు సిద్దమయ్యింది. ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది మోదీ సర్కార్.
దేశ సమగ్రతను దెబ్బతీసే సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారి వివరాలను పార్లమెంటరీ కమిటీ సేకరిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతల సమయంలో దేశానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యల గురించి ఆరా తీస్తోంది కమిటీ. ఈ మేరకు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి నివేదికను పార్లమెంటరీ కమిటీ కోరింది.
action plan on social media
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు నిషికాంత్ దుబే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం దాడికి సంబంధించి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో దేశ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వీరిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది.
action plan on social media
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ లేఖ పంపింది. ఈ క్రమంలో సమాచార సాంకేతిక చట్టం 2000 మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నియమాలు, 2021 ప్రకారం ఇలాంటి ఖాతాలపై యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకునేందుకు సిద్ధమా? అనే అంశాలపై మే 8లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ లేఖలు సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు పంపినట్టు తెలుస్తోంది.
action plan on social media
ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. ఆయన స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లేఖ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. కమిటీ అనుమతి లేకుండా కమిటీ ఛైర్మన్ లేఖ జారీ చేయలేరని, పార్లమెంటరీ నియమాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదని గోఖలే తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు, ప్రకటనలు వ్యక్తిగతం... రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటరీ కమిటీలను ఉపయోగించరాదని పేర్కొన్నారు.
action plan on social media
ఇటీవల భారత ప్రభుత్వ భద్రతాపరమైన ఆదేశాల మేరకు పాకిస్థాన్ కు చెందిన వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధించబడ్డాయి. వీటన్నీ పహల్గాం ఘటన తర్వాత తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వివిధ మంత్రిత్వ శాఖల నుండి కార్యాచరణ ప్రణాళిక కోరడాన్ని ముఖ్య పరిణామంగా చూస్తున్నారు. మరి సదరు మంత్రిత్వ శాఖల సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.