మావోయిస్టుల సంచలన నిర్ణయం.. జనవరి 1వ తేదీన ఆయుధాలు..
Maoists: దేశంలో నక్సలైట్ల అంతం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొందరు స్వచ్చంధంగా లొంగిపోతున్న క్రమంలో తాజాగా మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు.

ఆయుధాలు విడిచి పెడతామని
సీపీఐ (మావోయిస్టు) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ జోన్కు చెందిన దళాలు జనవరి 1, 2026 నుంచి ఆయుధాలు విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి అడుగుపెడతారని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనంత్ లేఖల రూపంలో, ఆడియో సందేశాల ద్వారా ప్రభుత్వాలకు పంపించారు.
మూడు రాష్ట్రాలకు లేఖ
అనంత్ నవంబర్ 22న తొలుత మూడు రాష్ట్రాల సీఎం లకు, ఛత్తీస్గఢ్ హోం మంత్రి విజయ్ శర్మకు లేఖ పంపి ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కోరారు. తాజా లేఖలో ఆయన వివరిస్తూ.. హోం మంత్రి “10–15 రోజులు సరిపోతాయని అన్నారని, కానీ ఇది చాలా తక్కువ సమయమని.. అయినా కూడా జనవరి 1, 2026 నిర్ణయంపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
దళాలకు సందేశం
ఒక్కొకరు విడివిడిగా కాక, ఒకేసారి ఆయుధాలు వదలాలని నిర్ణయించినట్లు అనంత్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నిర్ణయం పోరాటం శాశ్వతంగా ముగిసిందని కాదని, ప్రభుత్వ పునరావాస ప్రక్రియ స్వీకరిస్తున్నందున తాత్కాలిక విరామమని చెప్పారు. దళాలు ఈ సమయంలో ఎటువంటి హింసాత్మక చర్యలు చేపట్టకూడదని హెచ్చరించారు.
ప్రభుత్వాలకు విజ్ఞప్తి
అప్పటి వరకు సెర్చ్ ఆపరేషన్లు, అరెస్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. పోరాటం తప్పుగా వాడుతున్న ఆయుధాలపై ఆధారపడకూడదని, ఇది ప్రజల్ని మోసగించడం కాదని చెప్పుకొచ్చారు. కాగా దళాలు రేడియో ద్వారా నాయకత్వంతో సంప్రదించేందుకు 435.715 MHz ఫ్రీక్వెన్సీని ప్రకటించారు. రోజూ ఉదయం 11 నుంచి 11:15 మధ్య తప్పకుండా సంప్రదించాలని సూచించారు. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రకటనను రెండు రోజులపాటు జాతీయ వార్తలకు ముందు రేడియోలో ప్రసారం చేయాలని, ఆడియో టేపులు పది రోజులపాటు మీడియా ద్వారా అందుబాటులో ఉండాలని కోరారు.

