వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
LPG Shortage: భవిష్యత్తులో జరగబోయేదాన్ని జ్యోతిష్యులు చెబుతుంటారు. వీటిలో కొన్ని అటుఇటుగా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ట్వీట్ చూస్తే. భవిష్యత్తును ఇంత కచ్చితంగా ఉంటుందా అనిపించక మానదు.

వైరల్ అవుతోన్న జ్యోతిష్యుడి అంచనా
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ప్రభావం పడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత్లో కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరా కొంత అస్థిరంగా మారిందని కొన్ని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఒక జ్యోతిష్యుడు గతంలో చేసిన అంచనా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 2025లో చేసిన అంచనా మళ్లీ చర్చలోకి
జ్యోతిష్కుడు ప్రశాంత్ కిన్నీ 2025 సెప్టెంబర్లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో భారత్లో 2026 మార్చి తర్వాత పెట్రోలియం, సహజ వాయువు సరఫరాలో అంతరాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తవచ్చని ఆయన అప్పట్లో హెచ్చరించారు. తాజాగా ఎల్పీజీ సరఫరా సమస్యలపై వార్తలు వస్తుండటంతో ఆయన పాత ట్వీట్ మళ్లీ వైరల్ అవుతోంది.
India will face fuel and natural Gas shortage after March 2026...
Supply chain disrupt...!!??— Prashanth Kini (@AstroPrashanth9) September 27, 2025
మళ్లీ షేర్ చేసిన ట్వీట్తో పెరిగిన చర్చ
ఇటీవల ఆయన అదే ట్వీట్ను తిరిగి షేర్ చేస్తూ “ఈ అంచనాను దాదాపు ఐదు నెలల క్రితమే చెప్పాను” అని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. కొంతమంది ఇది కేవలం యాదృచ్ఛికం అని భావిస్తుండగా, మరికొందరు జ్యోతిష్య అంచనా నిజమవుతుందేమోనని కామెంట్లు చేస్తున్నారు.
ఎల్పీజీ సరఫరా సమస్యలు
ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా కొన్ని నగరాల్లో ఎల్పీజీ సమస్య తీవ్రమవుతోంది. ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో కొన్ని హోటల్ సంఘాలు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా ఇటీవల కొంత అస్థిరంగా ఉందని చెబుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యంగా జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం
ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవసరమైన సేవలకు గ్యాస్ సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు చేపట్టింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద గృహ వినియోగానికి గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చారు. గృహ వినియోగ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని సూచించారు. ఈ చర్యలతో సరఫరా పరిస్థితి త్వరలో స్థిరపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమచారం ఆధారంగా అందించడమైంది. సదరు జ్యోతిష్య అంచనా అధికారికంగా నిర్ధారించిన సమాచారం కాదని గమనించాలి.

