కిసాన్ క్రెడిట్ కార్డు: కేంద్రం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.2 లక్షలు
Kisan Credit Card Update: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా కేంద్రం రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 2 లక్షల లోన్ పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కేంద్రం సూపర్ ఆఫర్: రైతులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణాలు
రైతులకు గుడ్ న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారి ఆదాయాన్ని భారీగా పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అందించి, వారిని ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగా నుంచి కాపాడటానికి 'కిసాన్ క్రెడిట్ కార్డు' (KCC) పరిధిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత విస్తరించింది. ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.
రుణ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.. ఏయే రంగాలకు వర్తిస్తుంది?
మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన ప్రకారం ఈ పెంపు అమలులోకి వచ్చింది. ఈ డబ్బును పంట పెట్టుబడులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకే కాకుండా, పంట కోత తర్వాతి ఖర్చులకు, గిడ్డంగులకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా కేవలం పంటలు పండించే రైతులే కాకుండా పాడి పరిశ్రమ, పశుపోషణ, మత్స్య పరిశ్రమలైన చేపలు/రొయ్యల పెంపకం, మేకలు, పందుల పెంపకం దారులు కూడా ఈ కేసీసీ రుణాలను పొందవచ్చు.
ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండానే రూ. 2 లక్షల లోన్
చిన్న, సన్నకారు రైతులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక ప్రధాన వెసులుబాటు కల్పించింది. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం, ఎలాంటి ఆస్తుల పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. అంటే రైతులు తమ పొలం కాగితాలు లేదా స్థిరాస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పనిలేకుండానే రూ. 2 లక్షల వరకు స్వల్పకాలిక రుణం నేరుగా పొందవచ్చు.
వడ్డీ రేటు ఎంత? టైమ్కి కడితే భారీ రాయితీ
సాధారణంగా కేసీసీ కింద ఇచ్చే వ్యవసాయ రుణాలపై ఏడాదికి 7 శాతం వడ్డీ ఉంటుంది. అయితే రైతులు తీసుకున్న రుణాన్ని సరైన సమయానికి చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం అదనపు వడ్డీ రాయితీని ప్రోత్సాహకంగా ఇస్తుంది. దీనివల్ల టైమ్కి అప్పు తీర్చే రైతులకు పడే అసలు వడ్డీ కేవలం 4 శాతం మాత్రమే. కరవు కాటకాలు లేదా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణ గడువును 5 ఏళ్ల వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏ కాగితాలు కావాలి?
సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు, స్వయం సహాయక సంఘాలు కూడా దీనికి అర్హులు.
• అప్లికేషన్ ప్రాసెస్: సమీపంలోని వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ లేదా సహకార బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 'జన్ సమర్థ్ పోర్టల్' (Jan Samarth Portal), 'కిసాన్ రిన్ పోర్టల్' (Kisan Rin Portal) ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేయవచ్చు.
• కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాలి. పశుపోషణ, మత్స్య పరిశ్రమల వారైతే సంబంధిత స్థల వివరాలు, లైసెన్సులు లేదా ఆధారాలు ఇస్తే సరిపోతుంది.
ప్రస్తుతం దేశంలో 457 బ్యాంకులు కేసీసీ సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 7.72 కోట్ల మంది రైతులు యాక్టివ్ కేసీసీ కార్డులతో రూ.10 లక్షల కోట్లకు పైగా రుణ సౌకర్యం పొందారు.

