జెన్జీల మాటున కంత్రిగాళ్లు.. జంతర్ మంతర్ నిరసనల్లో హత్యలు, అత్యాచార నిందితులు
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆందోళనలకు సంబంధించి భద్రతా సంస్థలు చేపట్టిన సాంకేతిక విశ్లేషణలో మరింత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఫేస్ రికగ్నిషన్ ద్వారా 2,873 మంది గుర్తింపు
జూలై 20 నుంచి 25 వరకు జంతర్ మంతర్ పరిసరాల్లో జరిగిన ఆందోళనల సమయంలో రికార్డైన సీసీటీవీ దృశ్యాలు, హై-రిజల్యూషన్ కెమెరాల వీడియోలను పోలీసులు విశ్లేషించారు. వాటిని ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న నేరస్థుల డేటాబేస్తో సరిపోల్చగా మొత్తం 2,873 మంది క్రిమినల్ రికార్డు కలిగిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 989 మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయని సమాచారం. హత్య, అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ, దోపిడీ, పోక్సో చట్టం, ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుల్లో నిందితులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తీవ్రమైన నేరాల కేసుల్లో ఉన్నవారూ నిరసనల్లో పాల్గొన్నారా?
పోలీసుల విశ్లేషణ ప్రకారం, గుర్తించిన వ్యక్తుల్లో 101 మందిపై హత్య కేసులు, 61 మందిపై అత్యాచార కేసులు, 62 మందిపై హత్యాయత్నం, 284 మందిపై దోపిడీ, 229 మందిపై ఆయుధాల చట్టం, 25 మందిపై లైంగిక వేధింపుల కేసులు, 19 మందిపై కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. కొంతమందిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు కూడా ఉన్నాయని, కొందరు పలుమార్లు నిరసన ప్రదేశానికి వచ్చినట్లు సీసీటీవీ విశ్లేషణలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ అంశం దర్యాప్తులో కీలకంగా మారింది.
హింసాత్మక ఘటనలపై సీసీటీవీ ఆధారాలు
నిరసనల సమయంలో కొందరు ఆందోళనకారులు హింసకు పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. బారికేడ్లను ధ్వంసం చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు వీడియోల్లో నమోదైనట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, బస్సుల టైర్లను పంక్చర్ చేయడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనల్లో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం.
నిఘా వ్యవస్థ ఎలా పనిచేసింది?
జంతర్ మంతర్ పరిసరాలతో పాటు ఢిల్లీ నగరంలోని కీలక కూడళ్లు, ప్రవేశ మార్గాలు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసులు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా సేకరించిన ముఖచిత్రాలను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సహాయంతో విశ్లేషించారు. తర్వాత వాటిని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నేరస్థులు, హిస్టరీ షీటర్లు, పరారీలో ఉన్న నిందితుల డేటాతో సరిపోల్చి పరిశీలించారు. ఈ ప్రక్రియలోనే పెద్ద సంఖ్యలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తు కొనసాగుతోంది.. పలు కోణాల్లో విచారణ
పోలీసుల సమాచారం ప్రకారం, గుర్తించిన వ్యక్తుల్లో చాలామంది ఈశాన్య ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతాలకు చెందినవారని ప్రాథమికంగా తేలింది. వీరు స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొన్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమీకరించారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా ఏమైనా ప్రేరేపిత ప్రచారం జరిగిందా? హింసాత్మక ఘటనలకు ముందస్తు ప్రణాళిక ఉందా? అనే అంశాలపైనా విచారణ సాగుతోంది. జూలై 20 నుంచి జరిగిన అల్లర్లలో గుర్తించిన వ్యక్తుల పాత్ర, వారి మధ్య ఉన్న సంబంధాలు, ఇతర సంస్థలతో ఏమైనా అనుబంధాలు ఉన్నాయా అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

