- Home
- National
- India UK Trade Deal: ధరలు తగ్గుతాయ్.. మందుబాబులకు గుడ్ న్యూస్.. కార్ లవర్స్ కు పండగే !
India UK Trade Deal: ధరలు తగ్గుతాయ్.. మందుబాబులకు గుడ్ న్యూస్.. కార్ లవర్స్ కు పండగే !
India UK Trade Deal: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ తో భారత్ లో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ ఒప్పందంతో ధరలు తగ్గే వస్తువులు, భారత్ కు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ - యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్- బ్రిటన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) కుదిరింది.
ఈ ఒప్పందం దాదాపు మూడు సంవత్సరాలుగా చర్చల అనంతరం పూర్తయ్యింది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రెనాల్డ్లు ప్రధానమంత్రుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా వార్షికంగా దాదాపు 34 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే అవకాశం ఉందని అంచనా.
భారత ప్రజలకు చౌకగా లభించనున్న బ్రిటిష్ ఉత్పత్తులు
ఈ ఒప్పందం ప్రకారం, భారత్ యూకే నుండి దిగుమతి చేసే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరీ ముఖ్యంగా స్కాచ్ విస్కీ, బ్రిటిష్ కార్లు, సాఫ్ట్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, మెడికల్ డివైస్లు, ఎయిరోస్పేస్ భాగాలు తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గుతాయి. దీంతో వీటి ధరలు భారత్ లో భారీగా తగ్గనున్నాయి.
- బ్రిటిష్ కార్లపై ఉన్న ప్రస్తుతం 100% పైగా టారిఫ్ను 10%కి తగ్గించనున్నారు.
- స్కాచ్ విస్కీపై సుంకం తక్షణమే 150% నుండి 75%కి తగ్గుతుంది. రాబోయే పదేళ్లలో ఇది 40%కి తగ్గనుంది.
- యూకే ఉత్పత్తులపై సగటు టారిఫ్ 15% నుండి 3 శాతానికి పడిపోతుంది.
- డియాజియో (Diageo) తాత్కాలిక CEO నిక్ జాంగియానీ స్పందిస్తూ, “ఇది స్కాచ్, స్కాట్లాండ్కు గొప్ప క్షణం. జాన్ వాకర్తో కప్పు ఎత్తుతాం!” అని తెలిపారు.
భారత ఉత్పత్తులకు బ్రిటన్లో పెరగనున్న మార్కెట్
భారతీయ వస్త్రాలు, లోదుస్తులు, చర్మ ఉత్పత్తులు, ఆభరణాలు, ఆటో భాగాలు, కెమికల్స్, యంత్రాలు మొదలైన వాటిపై బ్రిటన్ దిగుమతి సుంకాలు తక్కువయ్యాయి. కొన్నింటిపై పూర్తిగా తొలగించారు. దీంతో భారత వస్తువులకు యూకేలో మార్కెట్ పెరగనుంది.
- బాస్మతి బియ్యం, మసాలా పదార్థాలు, తేనె, టీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, రొయ్యలు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు కూడా టారిఫ్ తగ్గింపులు అమలు కానున్నాయి.
- భారత్ నుంచి వస్తువులలో 99% ఎగుమతులకు ‘డ్యూటీ ఫ్రీ’ ప్రవేశం కల్పించనుందని పీయూష్ గోయల్ తెలిపారు.
సేవల రంగంలో భారీ లాభాలు
ఈ ఒప్పందం కేవలం వస్తువులకే కాకుండా సేవల రంగానికి కూడా విస్తృత ప్రయోజనాలను అందిస్తోంది.
- భారత సంస్థలు, ఫ్రీలాన్సర్లు యూకేలో 36 సర్వీసు రంగాల్లో ఎకానామిక్ నిడ్స్ టెస్ట్ లేకుండానే సేవలు అందించగలుగుతారు.
- భారతీయ నిపుణులు యూకే లో 35 రంగాల్లో 24 నెలల పాటు కార్యాలయం లేకుండానే పని చేయొచ్చు.
- భారతీయ ఉద్యోగులకు మూడు సంవత్సరాల పాటు బ్రిటన్లో సోషియల్ సెక్యూరిటీ పేమెంట్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
- దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్, టెక్ మహీంద్రా, విప్రో వంటి సంస్థలకు ఇది బలమైన అవకాశంగా మారనుంది.
రెండు దేశాలకు ప్రయోజనాలు
ఈ ఒప్పందం ద్వారా భారతీయ మార్కెట్లో యూకే తన ఉత్పత్తులను విస్తృతంగా ప్రవేశపెట్టే అవకాశం లభించింది.
- సగటున యూకే నుంచి భారతదేశానికి ఎగుమతులు దీర్ఘకాలంలో 60% పెరగనున్నట్లు అంచనా. ఇది £15.7 బిలియన్ విలువైన ఎగుమతులకు సమానం.
- ఈ ఒప్పందం ద్వారా 2,200 కొత్త ఉద్యోగాలు యూకే లో వస్తాయి. వార్షికంగా యూకే ఉద్యోగుల వేతనాలలో £2.2 బిలియన్ పెరుగుదల ఉంటుంది.
- బ్రిటిష్ ప్రజలకు బట్టలు, షూస్, ఆహార ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయి.
- యూకే కంపెనీలు భారత్లో రూ.2 బిలియన్ పైన ఉన్న ప్రభుత్వ టెండర్లపై దరఖాస్తు చేసుకునే అర్హతను పొందుతాయి. ఇది వార్షికంగా 40,000 టెండర్లను కలిగి ఉంటుంది.
- భారత్ కు కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున్న ప్రయోజనాలు కలుగుతాయి.
భారత్ - ఇండియా ట్రేడ్ డీల్ : దీర్ఘకాలిక మార్పులకు నాంది
ఇది ఇప్పటిదాకా భారత్ చేసిన అతి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్నారు. భారత్ ఇప్పటికే EU, USAతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తుండగా, ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ వాణిజ్య విధానాలలో భారత్ తన ప్రభావాన్ని విస్తరించగలదని అంచనా.
డెలాయిట్ ఇండియా భాగస్వామి అనిల్ తల్రేజా మాట్లాడుతూ.. “ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సహకారానికి, పెట్టుబడులకు, వాణిజ్యాభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తుంది” అన్నారు.
ఈ ఒప్పందానికి భారత్ మంత్రివర్గ అనుమతి, యూకే పార్లమెంటు ఆమోదం అవసరం. ఇది లాంఛనమే అని చెప్పవచ్చు.