- Home
- Feature
- Indian Railways: ట్రైన్లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !
Indian Railways: ట్రైన్లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !
Indian Railways: మీ బ్యాగ్ ట్రైన్లో పోయిందా? కంగారు పడకండి.. రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణికురాలి బ్యాగ్ చోరీ అయిన కేసులో రైల్వే శాఖను రూ.80 వేల పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇస్తూ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

మీ బ్యాగ్ ట్రైన్లో పోయిందా? కంగారు పడకండి
ట్రైన్ జర్నీలో మీ సామాన్లు జాగ్రత్త అని బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మీ సామాన్లు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే రాజధాని ఎక్స్ప్రెస్లో జరిగింది. 2021 డిసెంబర్ 14న ఒక మహిళ తన భర్త, పిల్లవాడితో కలిసి రాజధాని ఎక్స్ప్రెస్ (ట్రెయిన్ నంబర్ 12423) 3AC కోచ్లో ప్రయాణిస్తోంది. రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (ముగల్ సరాయ్) రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో, ఆ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. ఆ బ్యాగ్లో సుమారు 15 గ్రాముల బంగారు మంగళసూత్రం, రూ.5,000 నగదు, ఎస్బీఐ పాస్బుక్ ఉన్నాయి.
ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు
బ్యాగ్ పోయిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు కోచ్ అటెండెంట్ కోసం వెతికారు. అయితే ఆ సమయంలో అటెండెంట్ తన విధి నిర్వహణలో లేడు. దీంతో బాధితురాలి భర్త వెంటనే రైలులో ఉన్న ఆర్పీఎఫ్ ఎస్కాట్, టీటీఈ లను కలిసి విషయాన్ని తెలియజేశారు. డిసెంబర్ 16, 2021న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత బాధితులు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును జీఆర్పీ కాన్పూర్ సెంట్రల్కు బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పోయిన సామాన్లు మాత్రం దొరకలేదు. దాంతో విసిగిపోయిన బాధితులు రైల్వే సేవా లోపంపై పఠాన్కోట్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు.
రైల్వే వాదనను తోసిపుచ్చిన వినియోగదారుల కమిషన్
ఈ కేసు విచారణ సమయంలో రైల్వే శాఖ విచిత్రమైన వాదనలను వినిపించింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ మాస్టర్కు దొంగతనం గురించి సమాచారం ఇవ్వలేదని రైల్వే పేర్కొంది. అలాగే, బుక్ చేయని లగేజ్ చోరీకి గురైతే సుప్రీంకోర్టు పాత తీర్పుల ప్రకారం రైల్వేకు ఎలాంటి సంబంధం ఉండదని వాదించింది. అయితే, ప్రయాణ సమయంలోనే ఆర్పీఎఫ్ ఎస్కాట్కు ప్రయాణికులు సమాచారం ఇచ్చారని రైల్వే సొంత రికార్డుల్లోనే నమోదై ఉందని వినియోగదారుల కమిషన్ గుర్తించింది. దీని ద్వారా రైల్వే వాదన తప్పు అని నిరూపితమైంది. బాధితులు ప్రయాణం ముగియగానే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చోరీకి గురైన బంగారు మంగళసూత్రం కొనుగోలు రసీదులను కూడా సాక్ష్యంగా సమర్పించారని కోర్టు తెలిపింది.
కోచ్ అటెండెంట్ నిర్లక్ష్యం.. పెరిగిన జరిమానా
ఘటన జరిగిన సమయంలో కోచ్ అటెండెంట్ తన సీటులో లేడని ప్రయాణికులు చేసిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కోచ్ అటెండెంట్ విధుల్లోనే ఉన్నాడని నిరూపించడానికి రైల్వే ఎలాంటి డ్యూటీ రోస్టర్ లేదా రికార్డులను కోర్టు ముందు ఉంచలేకపోయింది. సెక్యూరిటీ విషయంలో రైల్వే తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, అవసరమైన ఆధారాలు చూపించడంలో విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉత్తర రైల్వే సేవా లోపానికి పాల్పడిందని పఠాన్కోట్ జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది.
రూ.80 వేల పరిహారంతో పాటు వడ్డీ చెల్లించాలని ఆదేశం
రైల్వే శాఖ నిర్లక్ష్యానికి గాను బాధితులకు రూ.70,000 పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు మానసిక వేదన, వేధింపులకు గురిచేసినందుకు మరో రూ.10,000 చెల్లించాలని చెప్పింది. కేసు నమోదైన తేదీ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించే వరకు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ తీర్పు ప్రతి వచ్చిన నెల రోజుల్లోగా ఈ డబ్బులు చెల్లించకపోతే, మొత్తం సొమ్ముపై 12 శాతం వార్షిక వడ్డీ అమలవుతుందని కమిషన్ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా బుక్ చేయని లగేజ్ పోతే రైల్వే పరిహారం ఇవ్వదు. కానీ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, రక్షణ లోపం నిరూపితమైతే మాత్రం ప్రయాణికులకు నష్టపరిహారం లభిస్తుందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.

