- Home
- National
- MiG-21 Retirement : అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నే హడలెత్తించిన భారత ఫైటర్ జెట్... ఇక వీడ్కోలు..!
MiG-21 Retirement : అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నే హడలెత్తించిన భారత ఫైటర్ జెట్... ఇక వీడ్కోలు..!
60 ఏళ్లపాటు భారత వాయుసేనలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికే సమయం దగ్గపడింది. మరో రెండునెలలో అంటే సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్బేస్లో ఈ ఫైటర్ జెట్ ఫెయిర్వెల్ వేడుక జరగనుంది.

భారత వాయుసేనలో గేమ్ చేంజర్
MiG-21 Retirement: ఇటీవల పాకిస్థాన్ తో యుద్దవాతావరణ సమయంలో భారత సైనికబలం బైటపడింది. ఈ సమయంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్దగల ఫైటర్ జెట్స్ గురించి తీవ్ర చర్చ జరిగింది. పాకిస్థాన్ ఉపయోగించిన చైనా, అమెరికా యుద్దవిమానాలు పిట్టల్లా రాలిపోయినా మన ఫైటర్ జెట్స్ మాత్రం చెక్కుచెదరలేవు... అనుకున్న లక్ష్యాలను నేలమట్టం చేసి సురక్షితంగా తిరిగివచ్చాయి. ఈ క్రమంలో మన దగ్గరున్న రాఫెల్, సుఖోయ్ వంటి ఫైటర్ జెట్స్ పేర్లు వినిపించాయి. కానీ వీటికంటే ముందు భారత రక్షణ వ్యవస్థను దశాబ్దాల పాటు భుజాన మోశాయి మిగ్-21 యుద్దవిమానాలు. భారత వాయుసేనలో గేమ్ చేంజర్ గా నిలిచాయి.
మిగ్-21 కు ఘన వీడ్కోలు
తాజాగా ఈ మిగ్-21 మరోసారి వార్తల్లో నిలిచింది. భారత వాయుసేనకు సుదీర్ఘకాలం సేవలందించిన ఈ మిగ్-21 ఫైటర్ జెట్స్ కి ఇప్పుడు వీడ్కోలు పలుకుతోంది మన సైన్యం. మరికొద్దిరోజుల్లో ఈ యుద్దవిమానం చరిత్రలో కలిసిపోనుంది... దీని రిటైర్మెంట్ తేదీని ఖరారుచేసింది ఇండియన్ ఆర్మీ.
భారత వైమానిక దళంలో 60 ఏళ్లకు పైగా సేవలందించిన ఈ చారిత్రక యుద్ధవిమానం 2025 సెప్టెంబర్ 19న అధికారికంగా రిటైర్ కాబోతుంది. ఈ సందర్భంగా చండీగఢ్ ఎయిర్బేస్లో ఓ గ్రాండ్ వీడ్కోలు వేడుక జరగనుంది. ఇదే 1963లో మిగ్-21 తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రదేశం కావడం విశేషం.
భారత్ వద్ద మిగ్-21 యుద్ద విమానాలు ఇన్ని ఉండేవా..!
భారతదేశపు తొలి సూపర్సోనిక్ యుద్ధవిమానంగా పేరుగాంచిన మిగ్-21, దేశ రక్షణ చరిత్రలో విశేష ప్రాధాన్యం పొందింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఎన్నో మిగ్-21లు నిర్మించబడ్డాయి. ఒకానొక సమయంలో భారత వైమానిక దళం 874 మిగ్-21లను కలిగి ఉండేది. తక్కువ ఖర్చుతో తయారీ, సరళమైన నిర్వహణ కలిగివుండటంతో ఇప్పటివరకు వీటిని కొనసాగించారు.
అత్యాధునిక టెక్నాలజీ యుద్ద విమానాలు వచ్చినా భారత వాయుసేన వీటిని కొనసాగిస్తూ వచ్చింది. కొత్త యుద్ధవిమానాలు తేజస్ ఆలస్యం కావడం కూడా మిగ్-21 కొనసాగింపుకు మరోకారణం. వరుస ప్రమాదాలతో "ఎగిరే శవపేటికలు" అపఖ్యాతిని మూటగట్టుకున్నా ఇవి దేశానికి ఎనలేని సేవలు అందించాయి.
యుద్ధాల్లో మిగ్-21 పాత్ర
మిగ్-21 అనేక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. 1971 కార్గిల్ యుద్ధంలో శత్రు విమానాలను కూల్చడం, రన్వేలను బాంబులతో ధ్వంసం చేయడంలో ఈ విమానాలే కీలకంగా వ్యవహరించాయి. యుద్ధంలో శత్రువుల బంకర్లపై దాడులు జరిపింది. 2019లో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మిగ్-21తో పాకిస్థాన్ F-16ను కూల్చేసి మరోసారి వీటి శక్తిని ప్రపంచానికి చాటారు.
మిగ్-21 విజయాలు
2004లో ‘కోప్ ఇండియా’ (ఇండియా-యూఎస్ వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు) లో మిగ్-21లు అమెరికన్ F-15లను ఓడించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది... దీని శక్తిని చూసి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఆశ్చర్యానికి గురయ్యింది. ఇక వియత్నాం నుండి మిడిల్ ఈస్ట్ వరకు మిగ్-21లు ఎన్నో విజయాలను అందుకున్నాయి. F-4s, మిరాజ్, పాకిస్తాన్ కు చెందిన అట్లాంటిక్ వంటి పవర్ ఫుల్ విమానాలను కూడా ఖచ్చితంగా కూల్చడం మిగ్-21 సామర్థ్యానికి నిదర్శనం.
ఇక తేజస్ శకం
మిగ్-21 రిటైర్మెంట్ తర్వాత HAL (హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్) తయారు చేస్తున్న తేజస్ మార్క్ 1A యుద్ధవిమానాలు వాటి స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. 2026 మార్చిలో మొదట ఆరు తేజస్ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరనున్నాయి. భవిష్యత్ లో భారత్ మరింత అత్యాధునిక యుద్దవిమానాలను తయారుచేయనుంది... కానీ మిగ్-21 వినూత్న శక్తి, చరిత్రను ఎవరూ మరవలేరు. అది సైనికుల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించింది.