- Home
- National
- Foreign Universities: ఇకపై చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. భారత్లో 4 కొత్త విదేశీ వర్సిటీలు
Foreign Universities: ఇకపై చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. భారత్లో 4 కొత్త విదేశీ వర్సిటీలు
విదేశాల్లో విద్యనభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. బీటెక్ పూర్తికాగానే అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్తున్నారు. అయితే భారత్లోనే కొత్తగా 4 విదేశీ వర్సిటీలు అందుబాటులోకి వచ్చాయి.ఆ వర్సిటీలు ఏంటంటే..

NEP వార్షికోత్సవంలో కీలక ప్రకటన
జాతీయ విద్యా విధానం (NEP) 2020 అమలుకు ఐదేళ్లు పూర్తైన సందర్భంలో మంగళవారం జరిగిన అఖిల భారతీయ విద్యా సమాగమ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన అతిథిగా హాజరై నాలుగు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలకు భారతదేశంలో క్యాంపస్ల ఏర్పాటుకు అనుమతించే లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందజేశారు.
ఏ ఏ విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి?
భారతదేశంలో కొత్తగా క్యాంపస్లు ప్రారంభించనున్న విశ్వవిద్యాలయాలు:
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) – గ్రేటర్ నోయిడాలో క్యాంపస్
విక్టోరియా యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) – నోయిడాలో క్యాంపస్
లా ట్రోబ్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) – బెంగళూరులో క్యాంపస్
యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ (యునైటెడ్ కింగ్డమ్) – ముంబైలో క్యాంపస్
దీంతో ఇప్పటివరకు భారతదేశంలో ఏర్పాటైనా, ప్రతిపాదించిన విదేశీ విశ్వవిద్యాలయాల సంఖ్య 13కి చేరింది.
ఏయే కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.?
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ:
బిజినెస్ అనలిటిక్స్, బిజినెస్ మార్కెటింగ్లో అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీలు, ఇన్నోవేషన్ & ఎంట్రప్రెన్యూర్షిప్, లాజిస్టిక్స్ & సప్లై చైన్ మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేట్ MBAలు అందిస్తుంది. ఇప్పటికే IISc, ICAR, AIIA, జల్ శక్తి మంత్రిత్వ శాఖలతో ఒప్పందం చేసుకుంది.
విక్టోరియా యూనివర్సిటీ:
బిజినెస్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు, IT, మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీలు అందించనుంది. ఇది ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ పార్ట్నర్షిప్లో కీలక భాగస్వామి.
లా ట్రోబ్ యూనివర్సిటీ:
స్మార్ట్ సిటీస్, మాలిక్యులర్ సైన్సెస్, బయోటెక్నాలజీ పరిశోధనలో ప్రసిద్ధి చెందిన ఈ యూనివర్సిటీ బెంగళూరులో బిజినెస్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ హెల్త్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు అందించనుంది. ఇది IIT కాన్పూర్తో జాయింట్ పీహెచ్డీ అకాడమీ, BITS పిలాని, TISSలతో ASCRIN నెట్వర్క్లో భాగంగా ఉంది.
యూజీసీ నోటిఫికేషన్ లో ఏముంది.?
2023లో UGC (University Grants Commission) నోటిఫికేషన్ ప్రకారం ప్రపంచ టాప్ 500 ర్యాంకింగ్లో ఉన్న విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా భారతదేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిబంధన ఆధారంగా తాజాగా ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు తమ ప్రణాళికలను ప్రకటించాయి.
భారత విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు
ఈ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో క్యాంపస్లు ప్రారంభించడం వల్ల విద్యార్థులు విదేశీ డిగ్రీలను స్వదేశంలోనే పొందే అవకాశం లభిస్తుంది. అదనంగా, తక్కువ ఖర్చుతో ఉన్నతమైన విద్య, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ ప్రమాణాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.