- Home
- National
- ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?
Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కేసుపై ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు జాగృతి అధ్యక్షురాలు కవితకు ఊరటనిస్తూ తీర్పు వచ్చింది

భారీ ఉపశమనం
ఢిల్లీ లిక్కర్ విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం నిందితులకు పెద్ద ఊరట లభించింది. ఈ కేసును విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు నమోదు చేసిన అభియోగాలను రద్దు చేస్తూ వారిని కేసు నుంచి విముక్తి కల్పించింది. దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఆధారాలు సరిపోవని పేర్కొన్న న్యాయస్థానం, కేవలం అనుమానాల ఆధారంగా పేర్లు చేర్చారని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందని తీవ్రంగా విమర్శించింది. అవసరమైతే దర్యాప్తు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కేసులో కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా మొత్తం 20 మందికిపైగా నిందితులపై నమోదైన అభియోగాలు కూడా కొట్టివేశారు.
ఇంతకీ కేసు నేపథ్యం ఏంటంటే.?
ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేసింది. ఆల్కహాల్ విక్రయాలను సక్రమంగా నిర్వహించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ విధానం తీసుకువచ్చారు. అయితే అమలు సమయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో 2022లో ఆ విధానాన్ని రద్దు చేశారు. లైసెన్సుదారులకు అనుకూలంగా నిబంధనలు మార్చి ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలు, మాజీ ఎంపీ కవితలను అరెస్టు చేశారు. తరువాత వారు బెయిల్పై విడుదలయ్యారు.
సీబీఐపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
చార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలకు సరైన సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. వేల పేజీల పత్రాల్లో పేర్కొన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేదా సాక్షుల వాంగ్మూలాలు లేకపోవడం గమనించిందని తెలిపింది. కేజ్రీవాల్ను కేసులో చేర్చేందుకు తగిన ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. మనీష్ సిసోడియాపై కూడా ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న వ్యక్తిపై కూడా స్పష్టమైన సాక్ష్యాలు లేవని పేర్కొంది.
కవిత, కేజ్రీవాల్ స్పందనలు
తనపై పెట్టిన ఆరోపణలు అసత్యమని మొదటి నుంచి చెబుతున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిజమైందని తెలిపారు. తనకు మద్ధతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడటం దేవుడి కృపగా భావిస్తున్నానని చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ కూడా కోర్టు తీర్పుపై స్పందిస్తూ సత్యం చివరకు గెలిచిందన్నారు. సరైన ఆధారాలు లేకుండా తనను జైలుకు పంపారని పేర్కొన్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ కంటతడి పెట్టారు.
కేసు తర్వాతి పరిణామాలు
ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన తర్వాత కేజ్రీవాల్ కొంతకాలం తీహార్ జైలులో ఉన్నారు. తరువాత సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజా కోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

