ఢిల్లీ పేలుడు వెనకాల పాకిస్థాన్ హస్తం..? షియా మతపెద్ద కీలక వ్యాఖ్యలు
Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన వెనుక పాకిస్థాన్ సంబంధాలు ఉన్నాయని షియా మతపెద్ద మౌలానా సయ్యద్ కల్బే జవాద్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పాకిస్థాన్పై మతపెద్ద ఆరోపణ
మౌలానా జవాద్ మాట్లాడుతూ.. “ఇస్లాం మతంలో అమాయకులను చంపడం అతి పెద్ద పాపం. ఢిల్లీలో చనిపోయిన వారు అమాయకులు, వారిని చంపినవారు ముస్లింలు కాదు, పేరుకే ముస్లింలు. ఈ చర్య ఇస్లాంను చెడుగా చూపించడానికి చేశారు,” అని పేర్కొన్నారు. “ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ దేశం ప్రమేయం నిరూపితమైతే, భారత్లో పాకిస్థాన్ను పూర్తిగా బహిష్కరించాలి. కఠిన చర్యలు తప్ప వేరే మార్గం లేదు,” అని చెప్పుకొచ్చారు.
ఫరీదాబాద్ టెరర్ మాడ్యూల్ లింక్
పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 కారు హర్యానాలోని బడార్పూర్ బోర్డర్ ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించింది. ఆ కారు జమ్మూ కశ్మీర్ పుల్వామాకు చెందిన వ్యక్తి పేరుతో నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫరీదాబాద్ టెరర్ మాడ్యూల్కి సంబంధం ఉన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మాడ్యూల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్ లష్కర్-ఏ-తయిబాతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
13 మందిపై దర్యాప్తు కొనసాగుతుంది
సీసీటీవీ ఫుటేజీలు, కారుకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ప్రస్తుతం 13 మందిని పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో కొందరు ఫరీదాబాద్ మాడ్యూల్కి సంబంధం ఉన్నవారిగా భావిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి శవం డిఎన్ఏ పరీక్షల తర్వాతే గుర్తించగలమని అధికారులు తెలిపారు.
సోషల్ మీడియా పోస్ట్తో కొత్త కోణం
ఇదే సమయంలో లష్కర్-ఏ-తయిబా ఉగ్రవాద సంస్థ పేలుడుకు సంబంధం ఉందని చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసులు ఆ పోస్ట్ను కూడా పరిశీలిస్తున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ దాడి ఉగ్రవాద దాడిగానే పోలీసులు భావిస్తున్నారు.
కేంద్రం సమీక్షా సమావేశం
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఈ సమావేశానికి అధ్యక్షవహించనున్నారు.