వీడు తండ్రి కాదు రాక్షసుడు.. కొడుక్కి తన పోలికలు రాలేవని ఏం చేశాడంటే
Crime News: ఒక తండ్రి తన బిడ్డను కాపాడాలి… కళ్లలో పెట్టుకుని చూసుకోవాలి. కానీ ఓ రాక్షసుడు మాత్రం తండ్రి పేరుకే మచ్చ తీసుకొచ్చాడు. అనుమానం అనే విషంతో కన్న కొడుకునే కడతేర్చాడు. ఈ అవమానీయ సంఘటన గురించి తెలిస్తే ఎవరైనా అతన్ని ఛీ కొట్టాల్సిందే.

తన పోలికలు లేవని
కర్ణాటకలోని విజయపుర జిల్లా నాగఠాణె గ్రామానికి చెందిన మల్లికార్జున, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ అనే ఆరు సంవత్సరాల కుమారుడు. బిడ్డ అందంగా ఉన్నా… తన పోలికలు కనిపించట్లేదనే కారణంతో తండ్రి మనసులో అనుమానం మొలకెత్తింది. ఏడాదిన్నర కాలంగా అదే ఆలోచన అతన్ని వెంటాడింది. ప్రేమగా చూడాల్సిన తండ్రి కుర్రాడిని హతమార్చే కుట్రకు తెర తీశాడు.
పథకం వేసి మరీ
మార్చి 16న బిడ్డను స్కూల్లో చేర్పిస్తానని భార్యకు చెప్పాడు. పథకంలో భాగంగా కుమారుడిని తీసుకుని మహారాష్ట్రలోని కరాడ్ ప్రాంతానికి వెళ్లిపోయాడు. మడోలి భికేశ్వర గ్రామం వద్ద కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్లి… ఎలాంటి దయ లేకుండా బిడ్డను నదిలోకి తోసేశాడు. ఆ చిన్నారి కేకలు… ఆ బాధ… ఎవరికీ వినిపించలేదు.
రెండు రోజులకు వెలుగులోకి వచ్చిన విషాదం
మార్చి 18న నదిలో బాలుడి మృతదేహం బయటపడింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినా… ఆ బాలుడు ఎవరో గుర్తించలేకపోయారు. ఇక ఇక్కడ తండ్రి మాత్రం… కుమారుడిని హాస్టల్లో చేర్పించానని భార్యను నమ్మిస్తూ నటించాడు. ఒక వైపు తల్లి తన బిడ్డ కోసం ఎదురుచూస్తుంటే… మరో వైపు నిజం నదిలో నిశ్శబ్దంగా దాగి ఉంది.
తల్లి అనుమానం… బయటపడిన నిజం
ఏప్రిల్ 1న బిడ్డ పుట్టిన రోజు. “మన బిడ్డను చూసి రావాలి” అని భాగ్యశ్రీ చెప్పింది. అయితే మల్లికార్జున అడ్డుకున్నాడు. అదే సమయంలో తల్లి మనసులో అనుమానం మొదలైంది. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడ్డాయి.
తండ్రి రూపంలో రాక్షసుడు
పోలీసుల ఎదుట మల్లికార్జున చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఆ వివరాలు విన్న అధికారులే షాక్ అయ్యారు. అనుమానం అనే చిన్న కారణంతో… తన కన్న బిడ్డ ప్రాణం తీసిన తండ్రి… మానవత్వానికి మచ్చగా నిలిచాడు. ఇప్పుడు అతనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

