Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?
Bank Holidays : 2026 మార్చి చివరి వారంలో శ్రీరామ నవమి, మహావీర్ జయంతి, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణలో బ్యాంకుల సెలవులు ఎప్పుడో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays 2026: మార్చి చివరి వారంలో వరుస సెలవులు
2026 మార్చి నెల ముగింపు వేళ బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. ఈ నెల చివరి వారంలో వరుసగా పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 26, 28, 29, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అయితే, శ్రీరామ నవమి పండుగ తిథి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో మార్చి 27న కూడా సెలవు ప్రకటించారు. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
రామ నవమి సెలవుల్లో మార్పులు: 26 లేదా 27?
చైత్ర నవరాత్రుల ముగింపు సందర్భంగా జరుపుకునే శ్రీరామ నవమి పర్వదినం ఈ ఏడాది మార్చి 26, 27 తేదీల్లో వస్తోంది. పంచాంగం ప్రకారం, నవమి తిథి మార్చి 26, గురువారం ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27, శుక్రవారం ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో సెలవులు ఉన్నాయి.
• మార్చి 26న సెలవు ఉన్న రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్.
• మార్చి 27న సెలవు ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, బీహార్.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మార్చి 27న బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకులకు వారాంతపు సెలవులు
పండుగ సెలవుల అనంతరం వచ్చే వారాంతంలో కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలు. ఈ క్రమంలో మార్చి 28న నాలుగో శనివారం కావడం, మార్చి 29న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వరుసగా రెండు రోజులు పనిచేయవు. దీనివల్ల మార్చి 26 నుండి 29 వరకు చాలా రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు వుండవు.
మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31న బంద్
మార్చి నెల చివరి రోజైన 31వ తేదీ (మంగళవారం) మహావీర్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే, మార్చి 30వ తేదీన (సోమవారం) బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. సెలవుల సమయంలో నగదు కొరత రాకుండా ఉండేందుకు ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

