- Home
- National
- Thalapathy Vijay: ఆ ఘటనతోనే విజయ్ కథ ముగిసిపోయిందన్నారు.. కానీ విధి అతని తలరాత మరోలా రాసింది
Thalapathy Vijay: ఆ ఘటనతోనే విజయ్ కథ ముగిసిపోయిందన్నారు.. కానీ విధి అతని తలరాత మరోలా రాసింది
Thalapathy Vijay: తమిళ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీ పెట్టాక కరూర్లో రాజకీయ ర్యాలీని నిర్వహించారు. అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా మరణించారు. ఇక విజయ్ కు రాజకీయాల్లో స్థానం ఉండదనుకున్నారు. కానీ విజయ్ ఇప్పుడు కింగ్ మేకర్లా మారారు.

విజయ్ కు అతి పెద్ద దెబ్బ ఇదే
సెప్టెంబర్ 27, 2025 తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాటను అక్కడి ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు. రాజకీయ నాయకుడిగా మారిన హీరో విజయ్ తన టీవీకె పార్టీ తరపున ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీలో అనుకోకుండా తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించారు. 100 మంది గాయపడ్డారు. కరూర్ - ఈరోడ్ రహదారిపై ఉన్న వేలుసామీపురంలో ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రచార ర్యాలీకి రావడం, విజయ్ ని చూసేందుకు బారికేడ్లు దాటుకొని దూసుకెళ్లడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత రాజకీయ ప్రత్యర్థులంతా విజయ్ పై తిరగబడ్డారు. ఇక విజయకు ఏ మొహం పెట్టుకొని తమిళ ప్రజలను ఓట్లు అడుగుతారని కామెంట్ చేశారు. విజయ్ పార్టీకి ఇక తమిళనాడు రాజకీయ చరిత్రలో స్థానం ఉండదని అనుకున్నారు. కానీ విధి బలీయమైనది. విజయ్ దళపతిని ఏకంగా కింగ్ మేకర్ ను చేసింది. తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు అవకాశాన్ని ఇచ్చింది.
అంచనా తప్పింది
2024లో టీవీకే పార్టీని ప్రారంభించాడు తమిళ నటుడు విజయ్. ఆ తర్వాత 2025లో కరూర్ - ఈరోడ్ రహదారిలో ఉన్న వేలుసామీపురం అనే ప్రాంతంలో ప్రచారం చేసేందుకు అనుమతి తీసుకున్నాడు. సాధారణంగా ఊహించిన ప్రకారం 10,000 మంది హాజరవుతారని అనుకున్నారు. అంతమంది ప్రజలకే అనుమతులు కూడా తీసుకున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం 60 వేల మంది వరకు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ఆరు గంటల ముందు నుంచే ఎండలో ఉన్నారు ప్రజలు. దీంతో కొంతమంది మూర్చ పోవడం జరిగింది. విజయ్ వాహనం దగ్గరే ఎంతోమంది కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అంతేకానీ తమ ఇష్టమైన నటుడిని చూడకుండా మాత్రం వెనుదిరిగి వెళ్లేందుకు ఇష్టపడలేదు.
విజయ్.. కింగ్ మేకర్ గా
విజయ్ వాహనం రాత్రి ఏడు గంటలు దాటాక ఆ ప్రాంతానికి చేరుకుంది. దాంతో 7:40 నిమిషాలకు తొక్కిసలాట జరిగింది. అక్కడున్న పోలీసులు, స్వచ్ఛంద సేవకులు కూడా వీరిని నియంత్రించలేకపోయారు. అంబులెన్సులు కూడా అక్కడికి చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. ఈ గందర గోళ పరిస్థితిలో విజయ్ కు ఏం చేయాలో తెలియక తన ప్రసంగాన్ని ఆపేసి ప్రజలకు మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశాడు. అలాగే అక్కడ తప్పిపోయిన ఒక బిడ్డ కోసం కూడా ఆయన మైక్ లో గట్టిగా అరుస్తూ కనిపించారు. మొత్తం మీద పది మంది పిల్లలు, 17 మంది మహిళలు మరణించారు. 100 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత విజయ్ తీవ్రమైన షాక్ లోకి వెళ్లిపోయాడు. వెంటనే తేరుకొని కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. కానీ ఈ ఘటన తర్వాత విజయ్ పై ఎంతో మంది విరుచుకుపడ్డారు. ఇక ఎన్నికల్లో అతను పోటీ కాదని, ఈ ఘటన వల్ల చెడ్డ పేరు వచ్చిందని భావించారు. కానీ విధి మాత్రం అతని రాతను మరోలా రాసింది. బూడిద నుంచి పుట్టిన ఫీనిక్స్ పక్షిలా ఎదిగాడు విజయ్. ఇప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొని సొంత ఇంట్లోనే మద్దతు లేకపోయినా.. ప్రజల మద్దతుతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా మారాడు.

