ఆధార్ అప్డేట్: డాక్యుమెంటేషన్ లేకుండానే పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ల మార్పు
Aadhaar Card Update : నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్పులకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. సిస్టమ్ స్వయంగా డేటాను ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చి అప్డేట్ చేస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆధార్ అప్డేట్: నవంబర్ 1 నుంచి డాక్యుమెంట్ల అవసరం లేదు
ఆధార్ సేవలు మరింత సులభం అవుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇవి ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటివరకు ఆధార్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ మార్చడానికి అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్లెస్ అవుతోంది.
ఆన్లైన్ అప్డేట్ సమయంలో యూజర్ ఇచ్చే సమాచారం స్వయంచాలకంగా ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో సరిపోల్చనుంది. ఇందులో పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, పాఠశాల రికార్డులు వంటి వివరాలు ఉంటాయి. అంటే స్కాన్ చేసి, అప్లోడ్ చేయాల్సిన పనిలేదు. సిస్టమ్ వెరిఫికేషన్ బాధ్యతలు తీసుకుంటుంది. అయితే, బయోమెట్రిక్ అప్డేట్ వంటి ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ కోసం మాత్రం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్ అప్డేట్ ఫీజుల్లో మార్పులు
UIDAI సేవల ఛార్జీల్లో కూడా మార్పులు చేసింది.
• పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ₹75 (అంతకుముందు ₹50)
• బయోమెట్రిక్ అప్డేట్ (ఫింగర్ప్రింట్, ఐరిస్, ఫోటో) అప్డేట్ కోసం ₹125 (అంతకుముందు ₹100)
5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల పిల్లల కోసం అయితే బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. ఇది ఒకసారి తప్పనిసరి అప్డేట్గానే అందిస్తున్నారు. అలాగే, 7 నుంచి 15 సంవత్సరాల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
పార్ కార్డ్, ఆధార్ లింకింగ్ గడువు పై కీలక ఆదేశాలు
ఆర్థిక శాఖ ఆధార్, పాన్ కార్డు లింకింగ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు పాన్–ఆధార్ లింక్ చేయాలి. 2026 జనవరి 1 నుంచి లింక్ చేయని పాన్ కార్డుల సేవలు కట్ చేస్తారు. మీ పాన్ కార్డు సేవలు నిలిపివేస్తే బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ అకౌంట్లు, పెట్టుబడులు వంటి ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయి.
మరింత వేగంగా ఈ కేవైసీ, ఆఫ్లైన్ కేవైసీ
UIDAI, NPCI సంయుక్తంగా కొత్త e-KYC, ఆఫ్లైన్ KYC సేవలు ప్రారంభించాయి. దీంతో మరింత వేగంగా సేవలు లభిస్తాయి. బ్యాంకులు, NBFCలు పూర్తి ఆధార్ నంబర్ అవసరం లేకుండా గుర్తింపు చేయగలవు. యూజర్ డేటా ప్రైవసీ సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ మరింత వేగంగా పూర్తవుతుంది.
ఆధార్కే వేరిఫికేషన్ కోసం కీలక మార్పులు
నకిలీ ఆధార్ల వల్ల ఆర్థిక భద్రతకు వచ్చిన ముప్పు తగ్గించేందుకు UIDAI కఠిన నిర్ణయం తీసుకుంది. యాక్టివ్, డూప్లికేట్-ఫ్రీ ఆధార్ నంబర్ ఉన్నవారికి మాత్రమే e-KYC ఉంటుంది. చెల్లని, అప్డేట్ చేయాని ఆధార్తో ఖాతా ఓపెనింగ్, పెట్టుబడులు ఆగిపోతాయి. ఇది ఆధార్ వ్యవస్థలో పారదర్శకత, భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.
డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరో ముందడుగు
పౌరులు ఆధార్ కేంద్రాలకు వెళ్లి క్యూల్లో నిలబడాల్సిన పనిలేకుండా సేవలు అందించడం యూఐడీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు కొద్ది క్లిక్లతో ఆధార్ అప్డేట్ పూర్తవుతుంది. పేపర్వర్క్ తగ్గి, టెక్నాలజీ ఆధారిత గవర్నెన్స్ మరింత బలపడుతుంది. ఆధార్ లో వచ్చిన ఈ మార్పులు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.