Black and White World: ఈ దేశ ప్రజలకు రంగులు తెలియవు, నలుపు తెలుపు తప్ప.. కారణం ఇదే
Color Blindness Island: పసిఫిక్ మహాసముద్రంలోని పింగెలాప్ అటోల్ దీవిలో ప్రజలకు రంగులు కనిపించవు. ఒక తుఫాను మిగిల్చిన జన్యుపరమైన మార్పు వల్ల అక్కడ అందరికీ ప్రపంచం నలుపు తెలుపులోనే కనిపిస్తుంది.

ఇక్కడ అందరికీ ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ సినిమానే !
మనం చూసే ప్రకృతి రంగురంగుల హరివిల్లు. కానీ, పసిఫిక్ మహాసముద్రంలోని ఆ చిన్న దీవిలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. అక్కడ ప్రజలకు ఎరుపు, పచ్చ, నీలం అనే తేడాలే తెలియవు. ఆకాశమైనా, అందమైన పూల తోటలైనా వారికి కనిపించేది కేవలం నలుపు తెలుపులోనే..
పసిఫిక్ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న 'పింగెలాప్ అటోల్' అనే చిన్న దీవిలోని ప్రజలకు ప్రపంచం మొత్తం పాతకాలపు నలుపు-తెలుపు సినిమా లాగే కనిపిస్తుంది. మైక్రోనేషియాకు చెందిన ఈ దీవిలో సుమారు 250 నుంచి 300 మంది నివసిస్తుంటారు. వీరు ఎదుర్కొంటున్న ఈ వింత పరిస్థితి వెనుక ఒక విషాదకరమైన చరిత్ర, అంతకంటే ఆశ్చర్యపరిచే సైన్స్ దాగి ఉంది.
ఆక్రోమాటోప్సియా: రంగులను మింగేసిన అరుదైన వ్యాధి
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన సమస్య ఆక్రోమాటోప్సియా. దీనినే పూర్తి రంగుల అంధత్వం అంటారు. కానీ ఈ చిన్న దీవిలో మాత్రం ప్రతి పది మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరి కళ్లలో రంగులను గుర్తించే కోన్స్ అనే కణాలు పనిచేయవు. ఫలితంగా వీరికి ఎరుపు, పచ్చ, నీలం వంటి ఏ రంగు తేడా తెలియదు. అంతా గ్రే షేడ్స్లోనే కనిపిస్తుంది. అందుకే ఈ దీవిని ప్రపంచం 'కలర్ బ్లైండ్ ఐలాండ్' అని పిలుస్తుంది.
1775 నాటి ఆ భీకర తుఫానుతో మారిన తలరాత
ఈ దీవిలో ఇంతమందికి ఈ సమస్య రావడానికి కారణం 1775లో సంభవించిన ఒక భయంకరమైన లెంకీకీ తుఫాను. ఆ తుఫాను ధాటికి దీవిలోని జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ బతికిన వారిలో ఆ దీవి రాజు ఒకరు. దురదృష్టవశాత్తు ఆయనలో ఈ ఆక్రోమాటోప్సియాకు కారణమైన అరుదైన జన్యువు ఉంది. ఆ తర్వాత మిగిలిన కొద్దిమంది మధ్యే వివాహాలు జరగడం, సంతానం కలగడంతో ఆ రిసెసివ్ జీన్ తరాల నుంచి వస్తూనే ఉంది. దీన్నే శాస్త్రవేత్తలు 'జెనెటిక్ బాటిల్నెక్' అని పేర్కొంటున్నారు.
వీరికి ఎండంటే భయం.. చీకటంటే ఇష్టం
ఈ వ్యాధి ఉన్నవారికి కేవలం రంగులు కనిపించకపోవడమే కాదు, వెలుతురు అంటే తీవ్రమైన భయం ఉంటుంది. సూర్యకాంతి వీరి కళ్లకు విపరీతంగా బాధను కలిగిస్తుంది. పగటిపూట వీరు కళ్లు సరిగ్గా తెరవలేరు, వస్తువులు మసకగా కనిపిస్తాయి. కానీ వీరికి ఒక సూపర్ పవర్ ఉంది. పగటిపూట ఇబ్బంది పడే వీరు, రాత్రి సమయంలో మాత్రం సాధారణ మనుషుల కంటే అత్యంత స్పష్టంగా చూడగలరు. చీకటిలో చేపలు పట్టడం, పనులు చేసుకోవడంలో వీరు దిట్ట. వెలుతురు లేని చోట వీరి దృష్టి చాలా షార్ప్గా ఉంటుంది.
శాస్త్రవేత్తల ప్రయోగశాలగా మారిన పింగెలాప్ అటోల్
పింగెలాప్ అటోల్ కేవలం ఒక దీవి మాత్రమే కాదు, జన్యుశాస్త్రవేత్తలకు ఒక గొప్ప పాఠశాల. ప్రముఖ న్యూరాలజిస్ట్ ఒలివర్ సాక్స్ ఈ దీవిని సందర్శించి 'ది ఐలాండ్ ఆఫ్ ద కలర్ బ్లైండ్' అనే పుస్తకాన్ని కూడా రాశారు. మానవ పరిణామ క్రమంలో ఒక చిన్న మార్పు వందల ఏళ్ల పాటు ఒక సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఈ దీవి ఒక నిలువెత్తు నిదర్శనం. రంగులు చూడలేకపోయినా, ప్రకృతితో కలిసిపోతూ వారు సాగిస్తున్న జీవనం మనకు వైవిధ్యం అంటే ఏమిటో చూపిస్తుంది.

