- Home
- Life
- Prawns Prasadam: ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా రొయ్యల వేపుడు, రొయ్యల బిర్యానీ, రొయ్యల కర్రీనే ఇష్టం
Prawns Prasadam: ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా రొయ్యల వేపుడు, రొయ్యల బిర్యానీ, రొయ్యల కర్రీనే ఇష్టం
Prawns Prasadam: సాధారణంగా దేవుళ్లకు పూర్తి శాకాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఒక ఆలయంలో మాత్రం ప్రజలు రొయ్యలతో చేసిన ఆహారాలు అమ్మవారికి నివేదిస్తారు. ఆ ఆలయం ఎక్కడుందో, ఆ కథేంటో తెలుసుకోండి.

రొయ్యలు ఇష్టపడే కాళీ మాత
మనదేశంలో కాళీ దేవి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కాళీదేవి శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో కాళీ మాతనే ఎక్కువగా కొలుస్తారు. కోల్ కతాలో కాళీ దేవికి ఒక ప్రత్యేక ఆలయం ఉంది. ఆ ఆలయంలోని కాళీ దేవిని సిద్దేశ్వరీ దేవి రూపంలో పూజిస్తారు. ఆ ఆలయంలో కాళీదేవికి ప్రతిరోజు మాంసాహార నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక ప్రత్యేకంగా అమ్మవారికి రొయ్యలతో చేసిన నైవేద్యాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రొయ్యల వేపుడు, రొయ్యల కర్రీ, రొయ్యల బిర్యానీ వంటివి వండి సమర్పిస్తారు. అలా రొయ్యల నైవేద్యాలు పెట్టి అమ్మవారిని వేడుకుంటే కోరికన కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఈ ఆలయాన్ని ‘తంతనియా కాళీబారి’ అని పిలుచుకుంటారు.
గంటల శబ్ధం విని
ఈ కాళీమాత ఆలయాన్ని తాంత్రికుడైన ఉదయ నారాయణ బ్రహ్మచారి 1703 సంవత్సరంలో నిర్మించాడని చెబుతారు. కోల్ కతా పెద్ద నగరంగా మారకముందు ఈ ప్రదేశంలో దట్టమైన అడవులు ఉండేవని, ప్రజలు ఈ ఆలయం పక్కగా వెళుతున్నప్పుడు ఆలయ గంటల శబ్దం వినిపించేదని చెప్పుకుంటారు. అందుకే ఈ ఆలయానికి తంతనియా కాళీ దేవి ఆలయమనే పేరు వచ్చింది.
గురువు కోసం రామకృష్ణ పరమహంస
ఈ తంతనియ కాళీమాత ఆలయంలో సంవత్సరం పొడవునా అమ్మవారికి మాంసాహార నైవేద్యాలే సమర్పించాలి. ఇక కాళీ చతుర్దశి, కొన్ని అమావాస్యరాత్రులలో మాత్రమే శాకాహార నైవేద్యాలు పెట్టాలి. ఇక్కడ మాంసాహారం సమర్పించే సంప్రదాయాన్ని మొదట రామకృష్ణ పరమహంస ప్రారంభించారని చెప్పుకుంటారు. ఒకసారి బ్రహ్మానంద కేశవ చంద్ర అనారోగ్యానికి గురయ్యారు. రామకృష్ణ పరమహంస ఆయన ఆరోగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఆయన అమ్మవారికి కొబ్బరితో కలిపి రొయ్యలను వండి సమర్పించారని చెప్పుకుంటారు. అప్పటినుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుందని నమ్ముతారు.
రామకృష్ణ పరమహంస శిష్యుల పూజ
మరొక నమ్మకం ప్రకారం రామకృష్ణ పరమహంస ఒకసారి తన తీర్థయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన శిష్యులు సిద్దేశ్వరి అమ్మవారిని ప్రార్థించి మాంసాహార నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పుకున్నారు. ఇక అప్పటినుంచి మాంసాహార నైవేద్యాలను పెట్టడం ప్రారంభించారని కూడా అంటారు. కోల్ కతా వెళితే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి రండి.

