Near to Death: మరణానికి దగ్గరైన వ్యక్తి తాను మరణిస్తున్నానన్న సంగతి తెలుసుకోగలడా?
Near to Death: మరణం అనేది ఒక్కసారిగా జరిగిపోయే ప్రక్రియ కాదు. అది క్రమంగా శరీరం నుంచి ఆత్మ విడిపోయే వివిధ దశల సమాహారం అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరణానికి చేరువైన వ్యక్తికి ఎలాంటి సూచనలు కనిపిస్తాయో కూడా గరుడ పురాణం వివరించింది.

మరణానికి ముందు ఎలా ఉంటుంది?
పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదని భగవద్గీత ఇప్పటికే చెప్పింది. చనిపోవడం అనేది శరీరం చేసే ఒక సహజ ప్రక్రియ. యాక్సిడెంట్లు, హఠాత్తుగా జరిగే ప్రమాదాలలో కాకుండా సహజంగా మరణానికి దగ్గరైన వ్యక్తికి ఆ చివరి నిమిషాలలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? అతనికి తాను మరణిస్తున్నానన్న సంగతి తెలుస్తుందా? లేదా? వంటి సందేహాలు ఎన్నో ఉంటాయి. ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు శిశువు జన్మిస్తున్న సంగతి తెలిసీ తెలియనట్లు ఎలా ఉంటుందో.. మరణిస్తున్న వ్యక్తికి కూడా మరణం సమీపంలో ఉందని సహజంగానే అర్థమయ్యే అవకాశం ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. ఒక మనిషి మరణానికి కొంత సమయం ముందు తనకు ఏదో జరుగుతోందనే భావన కలుగుతుందని పురాణం వివరిస్తుంది. ఇక ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం కొన్ని పరిశోధనల్లో కూడా ఇలాంటి విషయాలే బయటపడ్డాయి.

గరుడు పురాణం ఏం వివరించింది?
గరుడ పురాణం చెబుతున్న ప్రకారం మరణం సమీపిస్తున్నప్పుడు మొదట పంచేంద్రియాలు ఒక్కొక్కటిగా బలహీనపడతాయి. మొదటగా మాట తగ్గిపోతుంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నా కూడా నాలుక ఏమాత్రం సహకరించదు. ఆ తర్వాత చూపు మందగిస్తుంది. ఎదురుగా ఉన్న వారిని గుర్తుపట్టలేరు. చేతులు, కాళ్లు చల్లబడిపోయి శరీరం విపరీతంగా బలహీనంగా మారుతుంది. వినికిడి మాత్రం కొంతవరకు పని చేస్తుందని గరుడ పురాణం వివరిస్తోంది. అందుకే మరణిస్తున్న వ్యక్తి వద్ద మంచి మాటలు మాట్లాడాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అలాగే చివరి క్షణంలో ఉన్న వ్యక్తి కళ్ళ ముందు తన జీవితమంతా ఒక సినిమా లాగా కనిపిస్తుందని, తాను చేసిన పనులను గుర్తుచేసుకుని భయం లేదా ప్రశాంతత వంటివి కూడా కలుగుతాయని గరుడ పురాణం చెబుతోంది.
సైన్సు ఏం చెబుతోంది
ఆధునిక వైద్యశాస్త్రం చెబుతున్న ప్రకారం మరణ ప్రక్రియపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలో ఆసక్తికర విషయాలు కూడా వెల్లడయ్యాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం గుండె ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు మెదడు పని చేస్తూనే ఉంటుంది. ఆ సమయంలో మెదడులో విద్యుత్ తరంగాలు వేగంగా కదిలే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ సమయంలో కొందరికి వెలుగు కనిపించడం, తమ శరీరాన్ని బయట నుంచి చూసినట్టు అనిపించడం, చుట్టూ ఉన్నవారి మాటలు వినిపించడం.. వంటి అనుభూతులు కలుగుతాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒకేలా జరగాలని లేదు.
చివరి క్షణంలో ఇలా చేయాలి
మరణం గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు, సైన్స్ చెప్పే విషయాలు కొంతవరకు ఒకదానికొకటి దగ్గరగానే ఉన్నాయి. అయితే పూర్తి సమాచారం మాత్రం ఇంకా ఎక్కడా దొరకలేదు. గరుడ పురాణం దీన్ని ఆత్మ చేసే ప్రయాణంగా చెబితే, వైద్యశాస్త్రం శరీర వ్యవస్థలు క్రమంగా ఆగిపోవడం వల్ల కలిగే ప్రక్రియ అని వివరిస్తోంది. అయితే మరణించే ముందు వ్యక్తికి తాను వెళుతున్నాననే భావన మాత్రం ఉంటుందని అనేక విశ్వాసాలు చెబుతున్నాయి. అందుకే మరణశయ్యపై ఉన్న వారితో ప్రేమగా మాట్లాడాలని, వారికి ధైర్యం చెప్పాలని పెద్దలు వివరిస్తూ ఉంటారు.

