ఇంజనీరింగ్ అవసరం లేదు.. టెన్త్, ఇంటర్ చదివినా లక్షల జీతంతో సాప్ట్ వేర్ జాబ్స్..!
వర్క్ కల్చర్ మారుతోంది. పెద్దపెద్ద చదువులు అవసరం లేదు… ప్రతిభ ఉంటే చాలా పిలిచిమరీ ఉద్యోగాలిచ్చేందుకు సిద్దమవుతున్నాయి కంపెనీలు. ఇలా ఓ భారతీయ ఐటీ దిగ్గజం సరికొత్త ఉద్యోగ నియామకాలు సిద్దమయ్యింది.

యువతకు గుడ్ న్యూస్...
Software Jobs : సాప్ట్ వేర్ ఉద్యోగం చేయాలన్నది చాలామంది యువతీయువకుల కల. లక్షల్లో సాలరీ, పాష్ లైఫ్ స్టైల్ యువతను ఈ ఉద్యోగాల వైపు ఆకర్షిస్తోంది... అందుకే ఏటా లక్షలాదిమంది ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. అయితే ఎంత ప్రతిభ ఉన్నా డిగ్రీలు లేకుండా ఉద్యోగావకాశాలుండవు... సాప్ట్ వేర్ రంగంలోనూ ఇంతే.
ఇంజనీరింగ్, మాస్టర్స్ తో పాటు వివిధ సాప్ట్ వేర్ కోర్సులు చేస్తేనే కలల సాప్ట్ వేర్ జాబ్ సాధించవచ్చు... కానీ ఇది ఒకప్పటి మాట... ఇప్పుడు కాలంతో పాటే సాప్ట్ వేర్ కంపెనీల తీరు మారుతోంది. డిగ్రీ పట్టాలు చూసి ఉద్యోగాలిచ్చే రోజులు పోయి ప్రతిభ ఉంటే విద్యార్హతలు లేకున్నా ఉద్యోగాలిచ్చే రోజులు వచ్చాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ భారతీయ ఐటీ దిగ్గజం జోహో నియామకాలు.
డిగ్రీలు లేకున్నా జోహోలో జాబ్...
భారతీయ ఐటీ కంపెనీ జోహో దేశ విదేశాల్లో సాప్ట్ వేర్ సేవలను అందిస్తోంది. ఇలాంటి ప్రతిష్థాత్మక కంపెనీ విద్యార్హతల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు నియమించుకుంటోంది. ఈ మేరకు జోహో సీఈవో శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు.
జోహోలో ఇకపై ఉద్యోగ నియామకాలు డిగ్రీల ఆధారంగా ఉండవని శ్రీధర్ వెంబు ప్రకటించారు. మంచి నైపుణ్యాలు కలిగిన యువతీయువకులు డిగ్రీలు లేకున్నా జోహోలో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చని సూచించారు. ఇలా సర్టిఫికేట్స్ చూసికాదు ప్రతిభను చూసి ఉద్యోగాలిచ్చే కల్చర్ ను తీసుకువస్తోంది జోహో.
వర్క్ కల్చర్ ని మార్చేస్తున్న జోహో
ఎంత ఎక్కువ చదివితే అంత పెద్ద ఉద్యోగం వస్తుందనేది ఇండియన్ పేరెంట్స్ భావన. అందువల్లే చిన్నప్పటి నుండి తమ పిల్లలను చదువుల పేరిట ఒత్తిడి తెస్తుంటారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని పసిగట్టిన విద్యాసంస్థలు ఫీజుల పేరిట దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇలా ప్రస్తుత విద్యావ్యవస్థలో అనేక లోపాలున్నాయి.
చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే ఉండదు... చాలామంది పరిస్థితి ఇదే. కానీ ఉద్యోగం సాధించాలంటే డిగ్రీలు కావాలి. ఈ పరిస్థితిని మార్చేందుకు ముందుకు వచ్చారు జోహో సీఈవో శ్రీధర్ వెంబు. ప్రతిభ ఉంటే చాలు కనీస విద్యార్హతలున్నా తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని ఆయన ప్రకటించారు.
ఇండియన్ పేరెంట్స్... ఇకనైనా మారండి
భారతీయ పేరెంట్స్ చదువుల పేరిట ఇకనైనా పిల్లలపై ఒత్తిడి పెంచడం ఆపాలని జోహో సీఈవో సూచించారు. అమెరికా వంటి దేశాలు ఇప్పటికే డిగ్రీల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నాయని... అందుకే అక్కడి యువత చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగాలను పొందుతున్నారని తెలిపారు. అందుకే జోహో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందని... మంచి ప్రతిభగల యువతకు తమ సంస్థలో ఉద్యోగావకాశాలు ఉంటాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు.
జోహోలో యువతరం...
ఇండియన్ సాప్ట్ వేర్ దిగ్గజం జోహోలో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా యువతే ఉన్నారని శ్రీధర్ వెంబు తెలిపారు. తాను పనిచేస్తున్న టీమ్ లో ఉద్యోగుల సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని ఆయన వెల్లడించారు. ఇలా మంచి నైపుణ్యాలు గల యువతీయువకులను జోహో ప్రోత్సహిస్తూ ఉంటుందని... మంచి అవకాశాలు కల్పిస్తుందని సీఈవో శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు.
Smart American students now skip going to college and forward-thinking employers are enabling them. This is going to be a profound cultural shift. This is the real "youth power", enabling young men and women to stand on their own feet, without having to incur heavy debt to get a… https://t.co/qrtuWnCx5n
— Sridhar Vembu (@svembu) December 3, 2025

