- Home
- International
- Train Rules: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే.. పాకిస్థాన్లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
Train Rules: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే.. పాకిస్థాన్లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
Train Rules: పాకిస్తాన్లో రైలు ప్రయాణానికి సంబంధించిన నియమాలు కఠినంగా ఉంటాయి. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్లోలాగే అక్కడ కూడా రైల్వే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

టికెట్ లేకుండా ప్రయాణిస్తే వెంటనే చర్య
పాకిస్తాన్ రైల్వే నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి పట్టుబడితే వెంటనే చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కాడో అంచనా వేసి, అక్కడి నుంచి పట్టుబడిన స్టేషన్ వరకు మొత్తం దూరానికి సంబంధించిన పూర్తి చార్జీ వసూలు చేస్తారు. రైల్వే చెకింగ్ సిబ్బంది ఈ ప్రక్రియను చాలా కఠినంగా అమలు చేస్తారు. ట్రైన్లో చట్టవిరుద్ధంగా ప్రయాణించడం అక్కడ పెద్ద తప్పుగా పరిగణిస్తారు.

అసలు చార్జీతో పాటు భారీ జరిమానా
కేవలం టికెట్ ధర మాత్రమే కాదు, అదనంగా భారీ జరిమానా కూడా విధిస్తారు. ఉదాహరణకు ఒక ప్రయాణానికి అసలు టికెట్ ధర రూ.1000 అయితే, టికెట్ లేకుండా పట్టుబడిన వ్యక్తి మరో రూ.1000 జరిమానాగా చెల్లించాలి. అంటే మొత్తం రూ.2000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికుడికి రెట్టింపు భారం పడుతుంది. ఈ విధానం వల్ల ప్రజలు టికెట్ తీసుకుని ప్రయాణించేలా రైల్వే శాఖ కఠిన చర్యలు అమలు చేస్తోంది.
డబ్బులు చెల్లించకపోతే పోలీసుల చేతికి అప్పగింత
చెకింగ్ సమయంలో జరిమానా లేదా టికెట్ చార్జీ చెల్లించడానికి ప్రయాణికుడు నిరాకరిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అలాగే కావాలనే మోసం చేసే ఉద్దేశంతో టికెట్ లేకుండా ప్రయాణించినట్లు తేలితే, వెంటనే అతడిని తదుపరి స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి కేసు చట్టపరమైన దిశగా వెళుతుంది. రైల్వే పోలీసులు సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు.
కోర్టులో కేసు.. జైలు శిక్ష అవకాశం
రైల్వే పోలీసులు పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తిని రైల్వే మేజిస్ట్రేట్ లేదా కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే కఠిన శిక్షలు అమలవుతాయి. పాకిస్తాన్ రైల్వే చట్టం 1890 ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణించినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
అక్రమ ప్రయాణాలపై పాకిస్తాన్ రైల్వే ఫోకస్
పాకిస్తాన్ రైల్వే శాఖ తమ అధికారిక వెబ్సైట్, ప్రకటనల ద్వారా ప్రయాణికులకు తరచూ హెచ్చరికలు జారీ చేస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తోంది. రైళ్లలో ఆదాయ నష్టాన్ని తగ్గించడం, అక్రమ ప్రయాణాలను అరికట్టడం లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు.

