- Home
- Districts News
- Hyderabad
- India Pakistan War: టపాసులు కాలిస్తే జైలుకే.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు
India Pakistan War: టపాసులు కాలిస్తే జైలుకే.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ భారత్పై దాడులకు దిగుతోంది. అయితే పాక్ దాడులను ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పుకొడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేశారు.

diwali crackers
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నగరంలోని మిలిటరీ కాంటోన్మెంట్ ప్రాంతాల సమీపంలో పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధించారు.
మే 6, 7 తేదీల్లో భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం సీవీ ఆనంద్ ఈ ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. ఇది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన చర్యగా అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో, పటాకుల శబ్దాలు ఊహించని ప్రమాద సంకేతాలుగా కనిపించొచ్చని, పేలుడు లేదా ఉగ్రదాడి జరిగిందన్న అపోహలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీస్ కమిషనర్ ఆదేశాల్లో తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం వల్ల భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉందని, ఇది భద్రతా దళాలపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని ఆయన అన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా భద్రత మరింత కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, ఇలాంటి చర్యలు ప్రజల భద్రతకు హానికరం కావచ్చని సూచించారు. పబ్లిక్ ప్రదేశాలు, కార్యక్రమాలు, గుమిగూడే చోట్ల ఎలాంటి పటాకులు పేల్చకూడదని, ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.