Muskmelon: వేసవి కాలంలో కర్బూజా తింటే ఇన్ని లాభాలా?
సాధారణంగా ఎండకాలంలో ఒంటికి చలువ చేసే పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం. వాటిలో ముందువరుసలో ఉండేవి కర్బూజ. రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. ఎండకాలంలో కర్బూజా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లకు డిమాండ్ ఎక్కువ. వాటిలో ప్రధానమైనవి కర్బూజా. ఈ పండ్లు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి తీయగా ఉండటంతో పాటు వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండి, శరీరాన్ని చల్లబరుస్తుంది. కర్బూజ గింజల్లో 90 శాతం నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్య రాకుండా కాపాడుతుంది.
కర్బూజా పండు తినడం వల్ల కలిగే లాభాలు:
విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది:
కర్బూజాలో విటమిన్ సి (Vitamin C) ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.
పొటాషియం ఎక్కువ:
కర్బూజాలో పొటాషియం చాలా ఎక్కువ. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇవి తినడం చాలా మంచిది.
మెదడు పనితీరుకు..
కర్బూజా పండులో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బి6, నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. మెదడుకు సంతోషాన్ని కలిగించే సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి.
డీహైడ్రేషన్
నీళ్లు తాగడం వల్ల మానసిక స్థితి, శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. కర్బూజాలో నీటి శాతం ఎక్కువ. ఇది ఆరోగ్యంగా, తాజాగా ఉండటానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్యను రాకుండా చేస్తుంది.
కర్బూజా ఎలా తినాలి?
కర్బూజాను నేరుగా కట్ చేసి తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకొని తాగవచ్చు. దీన్ని సలాడ్లలో వేసుకోవచ్చు లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు. ఎండా కాలంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం కోసం చూస్తుంటే కర్బూజాను తప్పకుండా తినండి.