Mangoes: మామిడి పండ్లు తింటున్నారా? ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Mangoes: మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తాం. కానీ, దానిని తినే విధానం సరిగా లేకపోతే మీ ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే, దీనిని ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం.

Mangoes
ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. అందరికీ ముందు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. కేవలం ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి.. అందరూ వీటిని ఇప్పుడే తినాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ పండు తినే సమయంలో తెలిసీ తెలియక కొందరు చేసే తప్పుల కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఈ మామిడి పండ్లు తినే విషయంలో చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం...
1.అతిగా తినడం..
మామిడి పండు రుచిలో అద్భుతం. ఈ విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. చాలా మంది రుచిగా ఉన్నాయి కదా అని గంపలు గంపలు తినేస్తూ ఉంటారు. ఈ తప్పు చేయకూడదు. ఈ పండులో షుగర్ లెవల్స్, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఒక పండు కంటే ఎక్కువగా తినకూడదు.
2.ప్రోటీన్ లేకుండా తీసుకోవడం...
మామిడి పండు తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీనిని కంట్రోల్ చేయడానికి మామిడి పండును ప్రోటీన్ తో కలిపి తీసుకోవాలి. అంటే కొన్ని బాదం పప్పులు, పెరుగు లేదా కొంచెం పన్నీర్ వంటి ప్రోటీన్ కలిగిన ఆహారం తో కలిపి తీసుకోవాలి. అప్పుడు అధిక బరువు పెరిగే సమస్య ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
3.భోజనం చేసిన తర్వాత మామిడి పండు తినడం...
చాలా మంది భోజనం చేసిన వెంటనే డెజర్ట్ లా మామిడి పండు తింటారు. ముఖ్యంగా బిర్యానీ లాంటివి హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కోసం మామిడి పండు తినకూడదు. భోజనంలోని కేలరీలకు తోడు మామిడి కేలరీలు కూడా చేరితే.. జీర్ణక్రియ పై భారం పడుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల తర్వాత మాత్రమే పండు తినాలి.
4.వేగంగా తినడం...
ఏ ఆహారాన్ని అయినా బాగా నమిలి తింటేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. మామిడి పండును త్వరత్వరగా మింగేయడం వల్ల జీర్ణ ఏంజైమ్ లు సరిగా కలవవు. నిదానంగా నమిలి ఆస్వాదిస్తూ తింటేనే అది సులభంగా జీర్ణం అవుతుంది.
5.జ్యూస్ రూపంలో తీసుకోవడం...
చాలా మంది మ్యాంగో జ్యూస్ తాగడాన్ని ఇష్టపడతారు. మామిడి పండు జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఫైబర్ పోతుంది. ఫైబర్ లేకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. పండును పండులా తీసుకుంటేనే మంచి పోషకాలు లభిస్తాయి.

