Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
Fact: ఇంటికి తాళం వేయకుండా బయటకు వెళ్లం. ఇంట్లో డబ్బు, నగలు, విలువైన వస్తువులు ఉంటే మరీ జాగ్రత్తగా ఉంటాం. కానీ ఓ గ్రామంలో మాత్రం...అక్కడున్న ఏ ఇంటికీ తలుపులే ఉండవు. దీనికి కారణం తరతరాలుగా వస్తున్న నమ్మకం. అదేంటో తెలుసా?

దొంగల భయమే ఉండదా? ఏదైనా ఊరికి వెళ్లాలంటే ఎలా?
ఇంటికి తలుపులు, తాళం వేయకుండా బయటకు అడుగుపెట్టం. ఏ దొంగోడు వచ్చి దోచుకుపోతాడని భయం. అదే ఇంట్లో బంగారం, నగలు, విలువైన వస్తువులు ఇంటే...ఇంకా జాగ్రత్త పడిపోతాం. లేకపోతే బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాం. పక్కింటికి వెళ్లాలన్నా...తలుపు వేసే వేళ్తాం. అలాంటిది మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఏ ఇంటికీ తలుపులు ఉండవు. అయితే దొంగల భయమే ఉండదా? ఏదైనా ఊరికి వెళ్లాలంటే ఎలా?
అందుకే తాళాలు వేయరు
మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఉన్న శని సింగనాపూర్..శని దేవుడి ఆలయం కారణంగా దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. అయితే ఈ ఊరికి మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ చాలా ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. షాపులకు కూడా తాళాలు ఉండవు.
గ్రామస్థుల నమ్మకం ప్రకారం..శని దేవుడే ఈ గ్రామానికి రక్షకుడు అని. ఎవరు దొంగతనం చేసినా లేదా తప్పు చేసినా శని దేవుడి నుంచి తప్పించుకోలేరని విశ్వసిస్తారు. అందుకే ఇంటికి తాళం వేసుకోవాల్సిన అవసరం లేదని తరతరాలుగా భావిస్తున్నారు. అయితే దీని గురించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది.
వందల ఏళ్ల క్రితం కొట్టుకొచ్చిన రాయి
ఎప్పుడో వందల ఏళ్ల క్రితం వరదల సమయంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ రాయి గ్రామస్థులకు కనిపించిందని.. దానిని తాకినప్పుడు రక్తం వచ్చిందట. ఆ తర్వాత శని దేవుడు ఒక గ్రామస్థుడి కలలో కనిపించి తనను గ్రామంలో ప్రతిష్ఠించాలని చెప్పారని స్థానికంగా చెబుతుంటారు. అప్పటి నుంచి శని దేవుడే తమను కాపాడుతున్నాడనే బలంగా నమ్ముతారు.
బ్యాంకుకూ తాళాలు వేయరంట
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...ఈ సంప్రదాయం కేవలం ఇళ్లకే పరిమితం కాలేదు. గ్రామంలోని బ్యాంకు కూడా తాళాలు వేయరంట.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
శని శింగణాపూర్లో UCO Bank శాఖ 2011లో ప్రారంభమైంది. భద్రత కోసం అక్కడ సాధారణ తాళానికి బదులుగా రిమోట్తో పనిచేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ లాక్ ఉండేదట. కాకపోతే డైరెక్ట్ లాక్ ఉండేది కాదట. అటు సంప్రదాయాన్ని గౌరవిస్తూనే బ్యాంకును కాపాడుతున్నారు. అయితే ఈ గ్రామంలో దొంగతనాలు జరగలేదట. ఇక శని శింగణాపూర్లో శని దేవుడిని న్యాయానికి ప్రతీకగా, తప్పు చేసినవారికి శిక్షిస్తాడని నమ్ముతారు. అందుకే దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చినా శని దేవుడి నుంచి శిక్ష తప్పదనే భయం ప్రజల్లో ఉందని గ్రామస్థులు చెబుతారు.

