- Home
- Feature
- Indian Railways : నీలి రంగులో కాకుండా ఎరుపు రంగులో ట్రైన్స్? దీని వెనక ఇంత టెక్నాలజీ దాగుందా..!
Indian Railways : నీలి రంగులో కాకుండా ఎరుపు రంగులో ట్రైన్స్? దీని వెనక ఇంత టెక్నాలజీ దాగుందా..!
భారతీయ రైల్వే కోచ్లు నీలం రంగు నుంచి ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇది కేవలం రంగు మార్పు మాత్రమే కాదు దీని వెనుక ఉన్న అసలు కారణాలు, టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.

నీలం నుండి ఎరుపు రంగులోకి మారుతున్న రైలు బోగీలు
Train Colour : ఇండియన్ రైల్వే అనగానే మనందరికీ ముందుగా గుర్తుకువచ్చేది పట్టాలపై వేగంగా దూసుకెళ్లే నీలం రంగు బోగీలే. దశాబ్దాలుగా మన ప్రయాణాలలో భాగమైన ఈ నీలి రంగు కోచ్లు ఇప్పుడు క్రమంగా మాయమవుతున్నాయి. వాటి స్థానంలో మెరిసే ఎర్రటి రంగు బోగీలు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ రంగు మార్పు కేవలం ట్రైన్ ఆకర్షణ కోసం చేసినది కాదు… దీని వెనుక భారతీయ రైల్వే వ్యవస్థలో భద్రత, సాంకేతికత, ప్రయాణికుల సౌకర్యం పరంగా వచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు దాగి ఉంది.
నీలం రంగు కోచ్లను ఎందుకు నిలిపివేశారు?
మనం ఇన్నాళ్లూ చూసిన నీలం రంగు కోచ్లను తమిళనాడు రాజధాని చెన్నైలోని 'ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ' (ICF) తయారు చేసింది. ఇవి 1950ల నాటి సాంకేతిక పరిజ్ఞానంతో, సాధారణ ఉక్కు (Steel) తో రూపొందించబడ్డాయి. ఈ బోగీలు గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేయబడ్డాయి. వీటిలో సాంప్రదాయక ఎయిర్ బ్రేక్ వ్యవస్థను ఉపయోగించేవారు. ఇవి దశాబ్దాల పాటు సేవలు అందించినప్పటికీ, ఆధునిక ప్రయాణ అవసరాలకు, వేగానికి తగ్గట్లుగా రూపాంతరం చెందలేదు. ఈ కారణంగానే భారతీయ రైల్వే 2018 నాటికి ఈ నీలం రంగు ICF కోచ్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది.
జర్మన్ టెక్నాలజీతో ఎరుపు బోగీలు... ప్రత్యేకత ఏంటో తెలుసా?
నీలి రంగు కోచ్ల స్థానంలోకి వచ్చిన ఎర్రటి బోగీలను LHB (లింకే-హాఫ్మన్-బుష్) రకానికి చెందిన కోచ్లుగా పిలుస్తారు. ఇవి జర్మన్ సాంకేతికతతో తయారుకావడం విశేషం. పాత కోచ్లతో పోలిస్తే LHB కోచ్లను స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. దీనివల్ల ఇవి బరువు చాలా తక్కువగా ఉండటమే కాకుండా ఎంతో దృఢంగా ఉంటాయి. వేగం విషయంలోనూ ఇవి ఎంతో ముందున్నాయి. ICF కోచ్లు గంటకు 110 కి.మీ వేగానికే పరిమితమైతే LHB కోచ్లు గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో అత్యంత సులభంగా దూసుకెళ్లగలవు.
ప్రయాణికుల భద్రతకు 'యాంటీ-క్లైంబింగ్' రక్షణ
ఎరుపురంగు LHB కోచ్ల ప్రత్యేకత వాటి భద్రతా వ్యవస్థ. పాత ICF కోచ్లతో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక బోగీ మరొక బోగీపైకి ఎక్కేసి తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. అందుకే LHB కోచ్లలో 'యాంటీ-క్లైంబింగ్' (Anti-Climbing) టెక్నాలజీ ఉంటుంది. దీని కారణంగా ప్రమాద సమయాల్లో బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా ఆగిపోతాయి. ఇది ప్రయాణికుల ప్రాణాలకు బలమైన రక్షణ గోడలా నిలుస్తుంది. అంతేకాకుండా పాత బ్రేకులకు బదులుగా వీటిలో ఆధునిక 'డిస్క్ బ్రేక్లు' అమర్చడం వల్ల రైలు ఎంత వేగంతో వెళ్తున్నా చాలా తక్కువ దూరంలోనే సురక్షితంగా ఆపడానికి వీలవుతుంది.
ఎరుపు రంగు కోచ్లలో ప్రయాణం ఎలా ఉంటుంది?
వేగం, భద్రతతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ఎరుపు రంగు కోచ్ లలో పెద్దపీట వేశారు. LHB కోచ్లలో అత్యాధునిక 'హైడ్రాలిక్ సస్పెన్షన్' వ్యవస్థను అమర్చారు. దీనివల్ల ప్రయాణంలో రైలు కుదుపులు, బయటి నుంచి వచ్చే శబ్దం చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా ప్రయాణికులకు అలసట లేని, ప్రశాంతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది.
పాతకాలంనాటి నీలం కోచ్ల నుంచి ఈ కొత్త ఆధునిక కోచ్లను సులభంగా గుర్తించడానికే రైల్వే శాఖ మొదట ఎరుపు రంగును ఎంచుకుంది. కానీ కాలక్రమేణా ఈ ఎరుపు రంగే భారతీయ రైల్వే ఆధునీకరణకు, ప్రయాణికుల సురక్షిత భవిష్యత్తుకు ప్రతిరూపంగా మారిపోయింది. వందే భారత్ వంటి లేటెస్ట్ ట్రైన్స్ ను కూడా ఈ రంగునే వాడుతున్నారు.
మొత్తానికి, భారతీయ రైల్వేలలో కనిపిస్తున్న ఈ ఎరుపు రంగు విప్లవం కేవలం ఒక కొత్త రూపురేఖలు మాత్రమే కావు అది వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక భారత ప్రయాణ మార్గానికి ప్రత్యక్ష నిదర్శనం. పాత సాంకేతికతను వీడి ఆధునిక భద్రతా ప్రమాణాలను స్వీకరించడం ద్వారా భారతీయ రైల్వే తన ప్రయాణికుల భద్రత పట్ల ఉన్న కట్టుబాటును మరోసారి చాటిచెప్పింది.

