Putin: పంది అవయవాలతో 120 ఏళ్ళు మనిషి బతికేందుకు ప్రయోగం.. చావును జయించే ప్రయత్నం
Putin: మనిషి మరణాన్ని జయించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పంది అవయవాలను ఉపయోగించి 120 ఏళ్లు మనిషి బతికేలా భారీ అధ్యయనం రష్యాలో నడుస్తోంది. పుతిన్ తన ఆయుష్షును పెంచుకునేందుకు ఈ పరిశోధనలను చేయిస్తున్నాడు.

120 ఏళ్లు మనిషి జీవించేలా
మరణాన్ని జయించి మరింత కాలం ఆరోగ్యంగా జీవించాలన్నది ప్రతి మనిషి కోరిక. ఇలాంటివి మనం పురాణాల్లో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసాము. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దాన్ని నిజం చేసేందుకు భారీ అధ్యయనాన్ని తమ దేశంలో నడిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మనిషి వృద్ధాప్యాన్ని తగ్గించి, జీవిత కాలాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశం. అవసరమైతే కొత్త అవయవాలను మనుషులకు అమర్చి వారి జీవిత కాలాన్ని పెంచాలని ప్లాన్. దీని కోసం రష్యా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా పుతిన్ తన జీవిత కాలాన్ని పెంచుకోవాలన్నా ఉద్దేశంతోనే ఈ భారీ ప్రాజెక్టును నడిపిస్తున్నాడు. కనీసం 120 ఏళ్లు బతకాలన్నది ఆయన కోరిక.
చిన్న పందులను ఉపయోగించి
ఈ ప్రాజెక్టులో ఉపయోగించేది మినీ పిగ్స్. అంటే ప్రత్యేకంగా పెంచిన చిన్న పందులు. శాస్త్రవేత్తలు ఈ పందుల్లో మానవ అవయవాలను పెంచే అవకాశాలపై పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరికైనా గుండె, కాలేయం, మూత్రపిండం వంటివి దెబ్బతింటే దాతలు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేయడమే వీరి ఉద్దేశం. కొత్త అవయవాన్ని ఈ పందుల నుంచి తీసి మనుషులకు అమరుస్తారు. దీనితోపాటు త్రీడీ బయో ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ కణజాలాలను తయారు చేసే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాథమిక స్థాయిలో కణాలను తయారు చేసినట్టు తెలుస్తోంది.
క్రయో థెరపీ పద్ధతిలో కూడా
మరో పద్ధతిలో కూడా రష్యాలో పరిశోధనలు జరుగుతున్నాయి. అదే క్రయోథెరపీ. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను ఉపయోగించి శరీర కణాలలో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేయడమే దీని పద్దతి. అలాగే జీన్ థెరపీ ద్వారా కూడా వృద్ధాప్యానికి కారణమయ్యే కొన్ని మార్పులను నియంత్రించే మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో పుతిన్ కుమార్తె మరియా సహా ఎంతో మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.
ఇప్పటివరకు జరగలేదు
పుతిన్ బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకునే ఈ ప్రాజెక్టు పై అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విమర్శలు ఉన్నాయి. మనిషి అమరత్వం సాధించడం ఇప్పటివరకు ఎక్కడ శాస్త్రీయంగా నిరూపణ అవలేదు. అన్నీ కూడా ఇలా ప్రారంభ దశలోనే మిగిలిపోయాయి. ఒకవేళ అవి నిజమైనా కూడా ఆ ఫలితాలు సాధారణ ప్రజలకు చేరుకోవడానికి వందల ఏళ్ళు పట్టొచ్చు. అయినా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం, అవయవ మార్పిడి వంటివి వైద్యరంగంలో విప్లవానికి కారణమవుతాయి.

