Dancing Girl: ఆ డ్యాన్సర్ కోసం భారత్తో గొడవకు దిగిన పాకిస్థాన్.. ఎవరా నాట్యకారిణి?
Dancing Girl: భారత్, పాక్ మధ్య కేవలం ఒక డ్యాన్సింగ్ గర్ల్ కోసం తీవ్రంగా పోరాటం జరిగింది. ఆ డ్యాన్సర్ ఎవరు? ఆమె కోసం పాకిస్తాన్ భారత్ తో ఎందుకు గొడవకు దిగింది? ఈ గొడవంతా ఎప్పుడు జరిగింది? ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోండి.

డ్యాన్సర్ కోసం గొడవ పడ్డ పాకిస్థాన్
స్వాతంత్య్రం వచ్చాక 1947లో భారత్, పాకిస్థాన్ విడిపోయాయి. ఆ సమయంలో చాలా ఆస్తులను పంచుకున్నాయి. భూమి, నదులు, ఇతర ఆస్తులను కూడా పంచుకున్నాయి. అయితే దేశానికి సంబంధించిన పురావస్తు వస్తువులను కూడా షేర్ చేసుకున్నాయి. అయితే వీటిని పంచుకోవడం అప్పట్లో ఒక పెద్ద సవాలుగా మారింది. సింధు లోయ నాగరికతకు చెందిన ఎన్నో వస్తువులు అప్పటికే బయటపడ్డాయి. వాటి కోసం కూడా భారత్, పాక్ మధ్య పోరాటం జరిగింది. వాటిలో సుప్రసిద్ధ ‘డ్యాన్సింగ్ గర్ల్’ కాంస్య విగ్రహం ఒకటి. దీని కోసం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రమైన వాదనలు జరిగాయి. ఈ విగ్రహం మొహెంజొదారోలోని తవ్వకాల్లో దొరికింది. దేశ విభజన తరువాత ఆ ప్రాంతం పాకిస్థాన్లోకి వెళ్లడంతో ఆ విగ్రహం తమదేనని పాక్ వాదించింది. అయితే, అప్పటి భారత దౌత్యవేత్తలు, పురావస్తు నిపుణులు తెలివిగా వ్యవహరించి ఈ అరుదైన విగ్రహాన్ని భారతదేశానికి చెందేలా చేశారు. దేశ విభజన తరువాత పాకిస్థాన్, భారత్.. సుమారు 12,000 చారిత్రక కళాఖండాలను పంచుకున్నాయి. ఇందులో భాగంగా ‘ప్రీస్ట్ కింగ్’ పాకిస్థాన్కు వెళ్లగా, ‘డ్యాన్సింగ్ గర్ల్’ భారతదేశానికి దక్కింది. ప్రస్తుతం ఈ నాలుగు అంగుళాల విగ్రహం న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో పెట్టారు.
ఎవరు ఈ డ్యాన్సింగ్ గర్ల్?
డ్యాన్సింగ్ గర్ల్ కేవలం విగ్రహం కాదు.. దాని వెనుక ఎంతో చరిత్ర కూడా ఉంది. భారత పురావస్తు సర్వేక్షణ మాజీ డైరెక్టర్, పురావస్తు నిపుణులు ధర్మవీర్ శర్మ దీని గురించి వివరించారు. ఆయన చెబుతున్న ప్రకారం ఆ విగ్రహం నర్తకి కాదు, పురాతన కాలంలో స్త్రీల సంతానోత్పత్తికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాల గురించి ప్రచారం చేస్తున్న ఒక యువతి. ఆమె మెడలో ఉన్న మూడు గింజల మాలను 'శివలింగి' విత్తనాలుగా ఆయన చెబుతున్నారు. ప్రాచీనకాలంలో సంతాన లేమికి చికిత్సగా ఈ విత్తనాలను వాడేవారని, ఆ ఔషధాలను వాడమని ప్రచారం చేయడానికి ఈ విగ్రహాన్ని రూపొందించారని ఆయన వివరిస్తున్నారు. ఈ విగ్రహం భంగిమ నృత్యం కంటే కూడా, ఒక అవగాహన కల్పిస్తున్న మనిషిలా కనిపిస్తోందని ఆయన తెలిపారు.
చారిత్రక సంపద ఇది
తాజాగా పాఠ్యపుస్తకాలలో ఈ విగ్రహం బొమ్మలను చిత్రీకరించారు. దీంతో ఈ చారిత్రక కళాఖండాన్ని మరోసారి వార్తల్లోకి వచ్చింది. వేల ఏళ్ల నాటి ఈ చిన్న కాంస్య విగ్రహాన్ని సొంత చేసుకునేందుకు పాకిస్థాన్ చాలా ప్రయత్నం చేసింది. విగ్రహం నిజంగా డ్యాన్సర్దా లేక వైద్యశాస్త్రానికి సంబంధించినవారిదా? అనే చర్చ మాత్రం ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ ‘డ్యాన్సింగ్ గర్ల్’ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది దేశ విభజన నాటి జ్ఞాపకం.. అత్యంత విలువైన వారసత్వ సంపద. దీన్ని చూడాలంటే ఢిల్లీ వెళ్లాలి.

