- Home
- Feature
- Inspiring Story : ఇడ్లీ, దోసె పిండితో రూ.4000 కోట్ల వ్యాపారం.. ఆరో తరగతి ఫెయిలైన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ
Inspiring Story : ఇడ్లీ, దోసె పిండితో రూ.4000 కోట్ల వ్యాపారం.. ఆరో తరగతి ఫెయిలైన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ
నిరుపేద కుటుంబంలో పుట్టి, 6వ తరగతి ఫెయిలైన ఓ కుర్రాడు ఇప్పుడు రూ.4,000 కోట్ల కంపెనీకి అధిపతి అయ్యారు. ఓ చిన్న గదిలో ఇడ్లీ, దో'సె పిండి వ్యాపారం మొదలుపెట్టి ప్రపంచ స్థాయిలో విజయం సాధించిన యువ ఎంట్రప్రెన్యూర్ స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం.

ఆరో తరగతి ఫెయిలైన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ
''పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు... కానీ పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పే'' అని చెబుతుంటారు కొందరు గొప్పవాళ్లు. అంటే పుట్టుక నీ చేతిలో లేదు కాబట్టి ఏం చేయలేవు... కానీ నీ జీవితాన్ని ఎలా సాగించాలన్నది నీపైనే ఆధారపడి ఉంది.. మరి పేదవాడిగానే ఉంటావో, కష్టపడి గొప్పోడివి అవుతావో నీ చేతిలోనే ఉందనేది దీని భావం. ఈ కొటేషన్ కు పర్పెక్ట్ ఉదాహరణగా నిలిచాడు ఓ కేరళ కుర్రాడు. కడు పేదరికంలో పుట్టిన కుర్రాడు ఇప్పుడు కరోడ్పతిగా మారాడు. అతడు ఎవరో కాదు 'ఐడీ ప్రెష్ ఫుడ్' వ్యవస్థాపకులు పిసి ముస్తఫా. నేటి యువతరానికి స్పూర్తినిచ్చే అతడి సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరీ పిసి ముస్తఫా?
పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం ముగిసిపోయిందని నిరాశపడే యువతీయువకులకు పీసీ ముస్తఫా జీవితం ఒక పెద్ద పాఠం. కేరళలోని ఓ చిన్న పల్లెటూరిలో పుట్టిన ఇతడికి చదువు అబ్బలేదు... 6వ తరగతిలోనే ఫెయిలై బడి మానేశాడు. డబ్బులు లేవని, చదువు లేదని ఎప్పుడూ నిరాశ చెందలేదు... ఎంతో కష్టపడి ఇవాళ రూ.4,000 కోట్ల విలువైన కంపెనీకి అధిపతిగా ఎదిగాడు. బెంగళూరులో ఇంటింటా తెలిసిన 'ఐడీ ఫ్రెష్ ఫుడ్' (iD Fresh Food) ను స్థాపించి ఈ స్థాయికి చేరుకున్నాడు పీసీ ముస్తఫా. సున్నా నుంచి జీవితాన్ని ప్రారంభించి విజయపు శిఖరం అంచులకు చేరిన ఇతడు నేటీ యువతరానికి ఆదర్శం.
పీసీ ముస్తఫా కేరళ వయనాడ్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి రోజువారీ కూలీ. వాళ్ల కుటుంబం ఒక చిన్న గుడిసెలో ఉండేది. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడం, పేదరికం ఒత్తిడితో ముస్తఫా 6వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో బడి మానేసి తండ్రితో పాటు పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడి టీచర్ ఒకరు చదువు మానేయడం సరికాదని సరైన దారి చూపారు... 'చదువు మాత్రమే నీ పేదరికాన్ని పోగొడుతుంది' అని ప్రోత్సహించి మళ్లీ బడిలో చేర్పించారు. అప్పటి నుంచి కష్టపడి చదివిన ముస్తఫా ఎన్ఐటీ కాలికట్లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, ఆ తర్వాత బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశాడు.
ఐటీ ఉద్యోగం వదిలి వ్యాపారంలోకి అడుగు..
చదువు పూర్తయ్యాక ముస్తఫా అమెరికాతో పాటు కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పెద్దపెద్ద ఐటీ కంపెనీలలో పనిచేశాడు. లక్షల్లో జీతం వస్తోంది, విదేశాల్లో లగ్జరీ లైఫ్ ఉంది… కానీ ఇవేవీ ముస్తఫాకు సంతృప్తి ఇవ్వలేవు. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు తిరిగి వచ్చేశాడు.
2005లో ఐటీ రాజధాని బెంగళూరులో తన ఐదుగురు కజిన్స్తో కలిసి 'ఐడీ ఫ్రెష్ ఫుడ్' ప్రారంభించాడు ముస్తఫా. కేవలం 50 చదరపు అడుగుల చిన్న గదిలో ఇడ్లీ, దోసె పిండిని తయారు చేయడం మొదలుపెట్టాడు. ప్రారంభ రోజుల్లో ముస్తఫానే స్వయంగా స్కూటర్పై పిండి ప్యాకెట్లను తీసుకుని బెంగళూరులోని దుకాణాలకు పంపిణీ చేసేవాడు.
ఐడీ ఫ్రెష్ ఫుడ్ విజయ రహస్యం ఇదే..
మార్కెట్లో చాలా పిండి బ్రాండ్లు ఉన్నప్పటికీ 'ఐడీ ఫ్రెష్ ఫుడ్' విజయవంతం కావడానికి కారణం దాని నాణ్యతే. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ (నిల్వ ఉంచే రసాయనాలు) వాడకుండా, ఇంట్లో తయారు చేసుకున్నంత స్వచ్ఛంగా పిండిని అందించాలని ముస్తఫా నిర్ణయించాడు. ఇదే వారి కంపెనీపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేసింది. ఇడ్లీ, దోసె పిండి అమ్మకాలు బాగా పుంజుకున్నాక పరోటా, పెరుగు, కాఫీ డికాషన్ వంటి అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది ఐడి ఫ్రెష్ కంపనీ.
ఇడ్లీ, దోసె పిండితో రూ.4,000 కోట్ల సామ్రాజ్యం
ఒక చిన్న గదిలో మొదలైన బిజినెస్, స్కూటర్పై సరుకులు రవాణా చేసిన వ్యాపారం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం 'ఐడీ ఫ్రెష్ ఫుడ్' కంపెనీ విలువ రూ.4,000 కోట్లకు పైమాటే. భారత్లోనే కాకుండా దుబాయ్, అమెరికా, ఒమన్తో సహా 10కి పైగా దేశాల్లో ఈ కంపెనీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 50,000 కిలోల తాజా పిండిని వీరు తయారు చేస్తారు. ఈ కంపెనీ మరిన్ని దేశాలకు వ్యాపారాన్ని విస్తరించి మార్కెట్ ను పెంచుకునేందుకు సిద్దంగా ఉంది.
పీసీ ముస్తఫా కథ మనకు ఒకటే పాఠం నేర్పుతుంది… మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు భవిష్యత్తును నిర్ణయించవు. నిరంతర శ్రమ, పెద్ద కలలు కనే పట్టుదల ఉంటే ఎవరైనా జీవితాన్ని మార్చుకోవచ్చు.. చరిత్ర సృష్టించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. చదువుకున్నోళ్లే గొప్పోళ్లు కారు... పట్టుదల ఉంటే ఎవరైనా అద్భుతాలు చేయవచ్చని పిసి ముస్తఫా జీవితం చెబుతోంది.

