- Home
- Feature
- Heatwave Safety Tips : ఇక రోళ్లు పగిలే స్థాయిలో రోహిణి కార్తె ఎండలు.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Heatwave Safety Tips : ఇక రోళ్లు పగిలే స్థాయిలో రోహిణి కార్తె ఎండలు.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు… ఇకపై ఇదే పరిస్థితి ఉండబోతోంది. మరి ఈ ఎండలవేళ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనేది తెలుసుకుందాం.

ఎండలు బాబోయ్ ఎండలు..
రోహిణి కార్తె సమయంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. "రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయి" అని ఓ సామేత ఉంది... అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి మే 25 నుండి జూన్ 2 వరకు సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉండనున్నాడు.. అంటే వచ్చే వారమంతా భానుడి భగభగలు తప్పవన్నమాట. మండుటెండలతో ఉష్ణోగ్రతలు ఫీక్స్ కు చేరతాయి... వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
అయితే ఇంకా రోహిణి కార్తె రానేలేదు... అప్పుడే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... తెలంగాణ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఎలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు. మరి ఈ మండుటెండల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం.

ఎండల వేళ ఏం చేయాలి..?
నీరు ఎక్కువగా తాగాలి
దాహం వేయకపోయినా సరే రోజంతా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. దీంతో డీహైడ్రేషన్ సమస్య ఉండదు. ఎండల్లో శరీరంలోని నీటి శాతం తగ్గకుండా చూసుకోవడమే ప్రాథమిక సూత్రం.
ద్రవ పదార్థాలు తీసుకొండి
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ (ORS) వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.
దుస్తుల ఎంపిక
బయటకు వెళ్లేటప్పుడు లేత రంగులో ఉండే కాటన్ (పత్తి) దుస్తులను ధరించాలి. ఇవి గాలి ఆడేలా ఉండి, చెమటను త్వరగా పీల్చుకుంటాయి.
ఈ జాగ్రత్తలు తీసుకొండి
ఎండలో వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు వాడాలి. తలకు టోపీ లేదా కాటన్ తువ్వాలు చుట్టుకోవాలి. కళ్లకు సన్ గ్లాసెస్ ధరించడం మంచిది.
ఆహారం
నూనె తక్కువగా ఉన్న ఆహారం, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజ, దోసకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
ఇంటిని చల్లగా ఉంచుకోవడం
పగటిపూట కిటికీలకు కర్టెన్లు వేసి ఉంచాలి. సాయంత్రం వేళ గాలి వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచాలి.
ఏం చేయకూడదు..?
మధ్యాహ్నం బయటకు రావద్దు
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.
కెఫీన్ కలిగిన పానీయాలు తాగొద్దు
కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తో పాటు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలోని నీటిని త్వరగా ఖర్చు చేసి (Dehydration) తలనొప్పికి కారణమవుతాయి.
మసాలా ఫుడ్స్ వద్దు
అతిగా వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి వీటిని దీసుకోవద్దు.
కారులో జాగ్రత్త
పార్క్ చేసిన కారులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఒక్క క్షణం కూడా ఉంచకూడదు. ఎండలో కారు లోపలి ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.
శ్రమతో కూడిన పనులు వద్దు
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వ్యాయామం అస్సలు చేయకూడాదు. అలాగే రైతులు, ఇతర కార్మికులు బరువైన పనులు చేయకూడదు.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?
ఒకవేళ ఎవరైనా అలసటగా ఉన్నా, తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ చర్యలు తీసుకోండి.
వారిని నీడ ఉన్న చల్లని ప్రదేశానికి చేర్చాలి.
తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి.
ఓఆర్ఎస్ లేదా చల్లని నీరు తాగించాలి.
పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలి.
ముఖ్య గమనిక: రోహిణి కార్తె ప్రభావం పెద్దల కంటే చిన్న పిల్లలు, గర్భిణీలు వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
సురక్షితంగా ఉండండి.. ఎండల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి..!

