Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం
మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లోని సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. తెలంగాణ, ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ మాదిరిగానే ఆ దేశంలో ముసలివారికి ఫ్రీ ట్రైన్ జర్నీ స్కీమ్ ప్రకటించింది.

ఇక్కడ ఉచితంగా రైలు ప్రయాణం..
బంగ్లాదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ ఖోస్రు మహమూద్ చౌదరి ఈ ప్రకటన చేశారు. 65 ఏళ్లు పైబడిన ప్రతి బంగ్లాదేశీ పౌరుడికి రైళ్లలో ఉచిత ప్రయాణం, మెట్రో రైళ్లలో 25 శాతం ఛార్జీల రాయితీ అందిస్తామని తెలిపారు.
"దేశ నిర్మాణంలో సీనియర్ సిటిజన్ల పాత్ర ఎనలేనిది. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. ఈ పథకం ప్రకారం ఇకపై 65 ఏళ్లు పైబడిన బంగ్లాదేశీ ప్రజలు ప్రభుత్వ రైళ్లలో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే ఢాకా మెట్రో రైలు సర్వీసుల్లో 25% ఛార్జీల తగ్గింపు కూడా పొందుతారు.
మెట్రోలో కూడా ముసలివారికి రాయితీ
ఇప్పటికే బంగ్లాదేశ్ రైల్వే మంత్రిత్వ శాఖ 2026 మే 25 నుంచి సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు రైలు ఛార్జీలలో 25% తగ్గింపును అమలు చేస్తోంది. ఈ రాయితీ పొందాలంటే జాతీయ గుర్తింపు కార్డు (NID) ద్వారా వయస్సును ధ్రువీకరించుకోవాలి. ఆన్లైన్, స్టేషన్ టికెట్ కౌంటర్ల ద్వారా ఈ సదుపాయం పొందవచ్చు.
ఢాకా మెట్రో రైలు సర్వీసులో కూడా 65 ఏళ్లు పైబడిన వారికి 25% ఛార్జీల రాయితీని ఇప్పటికే ప్రవేశపెట్టారు. సింగిల్ జర్నీ టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రయాణికులు తమ జాతీయ గుర్తింపు కార్డును చూపించి ఈ రాయితీని పొందవచ్చని అధికారులు తెలిపారు.
వృద్ధుల సంక్షేమం..
బంగ్లాదేశ్ గణాంకాల శాఖ ప్రకారం.. దేశంలో 65 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరుగుతోంది. 2023లో మొత్తం జనాభాలో వీరి శాతం 6.14%కి చేరింది. వారి సామాజిక భద్రత, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రజా రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని, వారు స్వతంత్రంగా ప్రయాణించేందుకు ఈ పథకం దోహదపడుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇండియాలోనూ ఫ్రీ ట్రైన్ జర్నీ కోసం డిమాండ్...
అయితే ఆర్థికంగా, సామాజికంగా ఇండియా కంటే బాగా వెనకబడిన బంగ్లాదేశ్ వృద్ధుల సంక్షేమం కోసం ఫ్రీ రైల్వే ప్రయాణానికి అవకాశం కల్పించింది. కాబట్టి ఇలాంటి సదుపాయమే ఇండియాలో కూడా కల్పించాలనే డిమాండ్ వినిపించవచ్చు. ఇప్పటికే వృద్ధులకు రైల్వే టికెట్ కొనుగోలుపై రాయితీ ఇస్తోంది భారత ప్రభుత్వం... కానీ ఫ్రీగా ప్రయాణించే సదుపాయం కల్పించాలని వృద్ధులు కోరవచ్చు. అంటే తెలంగాణ, ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ లాగే దేశవ్యాప్తంగా ముసలివారికి ఫ్రీ రైల్వే జర్నీ స్కీమ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

