మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్లో `కాంతార` ప్రశ్న.. ఎగ్జామ్ పేపర్ షేర్ చేసిన హీరోయిన్.. వైరల్
కన్నడ నుంచి వచ్చిన మరో సంచలనం `కాంతార`. `కేజీఎఫ్` తర్వాత ఇండియన్ సినిమాని షేక్ చేసిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా పబ్లిక్ ఎగ్జామ్లో ప్రశ్నగా రావడం మరింత హాట్ టాపిక్ అవుతుంది.
`కాంతార`(Kantara) చిత్రం కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు, ఇండియన్ సినిమాని ఓ ఊపు ఊపింది. కేవలం 18కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.450కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నెమ్మదిగా పుంజుకుని సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఫిల్మ్ మేకర్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది అనేక పురస్కారాలను అందుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమని మరో మెట్టు ఎక్కింది.
`కాంతార` చిత్రం హవా ఇంకా కొనసాగుతుంది. ఓటీటీలోనూ సత్తా చాటుతుంది. అదే సమయంలో ఆడియెన్స్ నుంచి, ఫిల్మ్ మేకర్స్ లోనూ చర్చనీయాంశంగా మారుతుంది. అయితే తాజాగా ఈ సినిమా పబ్లిక్ ఎగ్జామ్స్ లోనూ ప్రశ్నగా మారడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. కన్నడ ప్రభుత్వ ఎగ్జామ్స్ లో ఓ ప్రశ్న `కాంతార` చిత్రం నుంచి వచ్చింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపర్లో ఈ సినిమా నుంచి ప్రశ్ని వచ్చింది.
ఇందులో `ఇటీవల విడుదలైన కాంతార చిత్రం దేని ఆధారంగా తెరకెక్కింది` అని ప్రశ్నించారు. దీనికి నాలుగు ఆప్షన్లుగా `జల్లికట్టు, భూత కోలా, యక్షగాన, దమ్మమి అనే ఆప్షన్లు ఇచ్చారు. క్వచ్ఛన్ పేపర్లోని ఈ ప్రశ్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన హీరోయిన్ సప్తమి గౌడ ఈ పేపర్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వచ్ఛన్ పేపర్` అని పేర్కొంది. దీంతో అది మరింత వైరల్ అవుతుంది.
ఇక `కాంతార` విషయానికి వస్తే.. బలమైన కంటెంట్ ఉంటే భాషకు అతీతంగా సినిమాని ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. ఇందులో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించడంతోపాటు సినిమాకి దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది. `కేజీఎఫ్`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించడం విశేషం. కన్నడ సాంప్రదాయ పండగ భూత కోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచింది.
ఇప్పటికే ఈ చిత్రం భారీ కలెక్షన్లతోపాటు ఐఎండీబీ టాప్ 10 అవార్డుని అందుకుంది. మున్ముందు మరిన్ని అవార్డులు అందుకోబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంతో దర్శకుడు రిషబ్ శెట్టికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. నటుడిగానూ ఆయన పాన్ ఇండియా స్టార్గా మారిపోవడం విశేషం.