గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండదండలతో ఇంటిని అక్రమంగా చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని నౌహీరా తెలిపారు. 


 సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది.  ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈవో నౌహీరా షేక్ కు చెందిన రూ. 75కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసినట్లు గణేష్ పై గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నౌహీరా షేక్ ఫిలింనగర్ లోని తన ఇంటిని బండ్ల గణేశ్ కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గూండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. వివరాల్లోకి వెళితే...

హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్ అద్దెకు ఉంటున్న తన ఇంటిని ఖాళీ చేయమని కోరుతున్నా పట్టించుకోకపోగా, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ లోని ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని నౌహీరా షేక్ కంప్లైంట్ చేశారు.

ఇక  ఈ విషయమై ఫిబ్రవరి 15నే ఆమె ఫిర్యాదు చేసినా ఫిలింనగర్ పోలీసులు పట్టించుకోకపోవడంతో తాజాగా నౌహీరా షేక్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా అద్దె చెల్లించకపోగా ఇంటిని ఖాళీ చేయాలని కోరినందుకు తనను నిర్బంధించి బెదిరింపులకు దిగాడని ఆరోపించారు. గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండదండలతో ఇంటిని అక్రమంగా చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని నౌహీరా తెలిపారు. తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేష్ పై ఐపిసి 341,506 సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.