ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలా.. బూతులతో రెచ్చిపోయిన గాయని
హాలీవుడ్ నటి, పాప్ గాయని బహుముఖ ప్రజ్ఞాశాలి రిహానా సోషల్ మీడియా వేదిక సహనం కోల్పోయింది. ఓ లైవ్ షో సందర్భంగా అభిమానులు పదే పదే నెక్ట్స్ ఆల్బమ్ గురించి అడగగా ఆమె తీవ్రంగా స్పందించింది.
ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ ఆపత్కాలంలో సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. రిహానా కూడా తన వంతు సాయం చేస్తోంది.
ఇప్పటికే ధన రూపంలో విరాళం ప్రకటించిన రిహానా ముందు ముందు తన సాయాన్ని మరింతగా పెంచేందుకు ప్లాన్ చేస్తోంది.
తాజాగా ఈ భామ ఫెంటీ సోషల్ క్లబ్ పార్టీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లైవ్ షోను నిర్వహించింది. అయితే ఈ లైవ్లో భాగంగా అభిమానులు చాలా మంది ఆమెను నెక్ట్స్ ఆల్బమ్ ఎప్పుడూ అంటూ ప్రశ్నించారు.
అయితే ఈ ప్రశ్నలపై చిర్రెత్తుకొచ్చిన రిహానా కాస్త ఘాటుగానే స్పందించింది. బూతులతో రెచ్చి పోయింది. మీడియాలో చెప్పడానికి వీలులేని బూతులు ఉపయోగిస్తూ దూషించింది.
మీ అధ్యక్షుడిలా కాకుండా నేను ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో ఉంటే మీరు నా నెక్ట్స్ ఆల్బమ్ గురించి అడుగుతారా.. అంటూ ఫైర్ అయ్యింది.
అయితే ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా 5 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించింది. ఆ మొత్తాన్ని ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి భోజనం అందించేందుకు వినియోగించాలని ఆమె కోరింది.