ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో కొత్త రూ.20 నోట్లు: పాత, కొత్త నోట్ల మధ్య తేడా అదొక్కటే
new Rs 20 notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్లో భాగంగా రూ.20 నోట్లు త్వరలో విడుదల కానున్నాను. ఈ నోట్లపై తాజాగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ నోట్లు ఎప్పుడు మార్కెట్ లోకి రానున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11, 2024 నుంచి గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆయన హయాంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న తొలి నోట్ ఇది. కొత్త రూ.20 నోటు రూపకల్పన, లక్షణాలు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.20 నోట్లతో సమానంగా ఉంటాయి.
పాత రూ.20 నోటుకు, కొత్త రూ.20 నోటుకు తేడా ఏమిటంటే కొత్త గవర్నర్ సంతకం మాత్రమే భిన్నంగా ఉంటుంది. పాత రూ.20 నోట్లు చెలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోట్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో భాగంగా ఆకుపచ్చ-పసుపు రంగులో ఎల్లోరా గుహల చిత్రంతో ఉంటాయి.
RBI చట్టం, సెక్షన్ 26(2) ప్రకారం రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రతి కాయిన్, నోటును ప్రజలంతా కచ్చితంగా ఉపయోగించాలి. ఇది చెల్లుబాటు కాదు అని ఎవరూ అనడానికి వీల్లేదు. ఈ విధంగా ఆర్బీఐ చట్టం చెబుతోంది.
ఆర్బీఐ ప్రకారం చట్టపరంగా చెలామణిలో ఉన్న ప్రతి నోటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించొచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ హామీతో చెలామణి అవుతాయి. అదే విధంగా భారత ప్రభుత్వం విడుదల చేసిన రూ.1 నోట్లు కూడా చెలామణిలో చెల్లుబాటు అవుతాయి.
దేశంలోని నోట్లు నాలుగు కరెన్సీ ప్రెస్లలో ముద్రిస్తారు. అందులో రెండు నాసిక్ (పశ్చిమ భారతదేశం), దేవాస్ (మధ్య భారతదేశం) ప్రాంతాల్లో భారత ప్రభుత్వ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఆధ్వర్యంలో ఉన్నాయి.
మరో రెండు మైసూరు (దక్షిణ భారతదేశం), సాల్బోని (తూర్పు భారతదేశం) ప్రాంతాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ద్వారా నిర్వహణలో ఉన్నాయి.
నాణేలు ముంబై, హైదరాబాద్, కోల్కతా, నోయిడాలోని నాలుగు మింట్లలో తయారవుతాయి. ఇవన్నీ భారత ప్రభుత్వ సంస్థ SPMCIL యాజమాన్యంలో ఉన్నాయి.
మొత్తానికి కొత్త రూ.20 నోట్లు త్వరలోనే మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయన్న మాట. పాత నోట్లు కూడా చెలామణి అవుతాయి కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.