- Home
- Business
- Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?
Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?
India Independence Day 2026: గత 79 ఏళ్లలో భారత ఉద్యోగ రంగంలో ఊహించని మార్పులు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి ఏఐ యుగం వరకు మన ఉద్యోగ రంగం ఎలా మారింది? 3 తరాల ఎంప్లాయ్మెంట్ ప్రయాణంపై జరిగిన మార్పులను గమనస్తే చాలా ఆసక్తికర విషయాలున్నాయి.

79 ఏళ్ల స్వతంత్ర భారతం: వ్యవసాయం నుండి ఏఐ వరకు ఉద్యోగ ప్రయాణం
రెండేళ్ల కిందటి తరానికి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం. పింఛను గ్యారంటీ. ఆ తర్వాత తరానికి ఉద్యోగం అంటే ప్రైవేట్ కంపెనీలో నెలనెలా వచ్చే జీతం. మరి ఈనాటి జనరేషన్ పరిస్థితి ఏంటి? ఇవాళ సెక్యూరిటీ అంటే ఒక ఒకే కంపెనీలో ఉండే ఉద్యోగం కాదు, నేర్చుకున్న స్కిల్స్, ఆ తర్వాత దక్కించుకునే కొత్త గిగ్ వర్క్. ఒకే ప్రశ్నకు మూడు తరాలు పూర్తి భిన్నమైన సమాధానాలు ఇచ్చాయి. ఒక ఉద్యోగం మనిషికి నిజంగా ఏమి గ్యారంటీ ఇస్తుంది?
భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ రంగం వేర్వేరు దశలను చూసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆయా కాలాల్లో ఏ రంగాలు ఆధిపత్యం చెలాయించాయనే దానికంటే, ఆ ఉద్యోగాలు కార్మికులకు ఏమి అందించాయనేదే ఇక్కడ ముఖ్యం.
1947 నుండి 1980 వరకు: భద్రతే ప్రధాన ధ్యేయం
1947 నుంచి 1980 వరకు ఉన్న కాలాన్ని సెక్యూరిటీ యుగం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం మాత్రమే సామాజిక భద్రతకు పునాదిగా ఉండేవి. ఒకసారి ఉద్యోగంలో చేరితే జీవితాంతం ఒకే సంస్థలో పనిచేయడమే అప్పటి సంప్రదాయం.
ఆనాటి ముద్ర నేటికీ పూర్తిగా చెరిగిపోలేదు. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా ఐదవ వంతు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, నేటికీ 46 శాతం మంది ఉపాధి కోసం దానిపైనే ఆధారపడుతున్నారు. 1991 ఆర్థిక సంస్కరణలకు ముందు పరిస్థితి ఇది. 1983-84 ఆర్బిఐ డేటా ప్రకారం, పది మందిలో ఏడుగురు భూమిపైనే ఆధారపడ్డారు. వర్షాలపైనే ఆధారపడే ఈ ఉపాధికి మార్కెట్తో సంబంధం ఉండేది కాదు. అప్పట్లో నేషనల్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ (1945), క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ (1950), అప్రెంటిస్షిప్ యాక్ట్ (1961) వంటివి పరిమిత ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేవి.
1991 సంస్కరణలు: తెరుచుకున్న గ్లోబల్ మార్కెట్
1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత ఉద్యోగ రంగాన్ని మలుపు తిప్పాయి. ఉద్యోగం అంటే ప్రభుత్వం కేటాయించడం కాదు, ఓపెన్ మార్కెట్లో ప్రతిభ ద్వారా సంపాదించుకోవడం అనే కొత్త శకం ఇక్కడే మొదలైంది. సంస్కరణల వల్ల మూలధనం, వ్యాపార స్వేచ్ఛ పెరిగి, భారతీయ ప్రతిభను ప్రపంచ మార్కెట్లు గుర్తించాయి.
ఈ మార్పు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 1980-81లో జీడీపీలో 15 శాతంగా ఉన్న విదేశీ వాణిజ్యం, 2005-06 నాటికి 34 శాతానికి పెరిగింది. అలాగే 1991లో 0.3 శాతంగా ఉన్న ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 2005 నాటికి 5.8 శాతానికి చేరాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ రిపోర్టు పేర్కొంది.
ఐటీ విప్లవం: సాంకేతిక రంగంలో ఊహించని మార్పులు
మూడో దశలో భారతీయ నైపుణ్యాల విలువ అంతర్జాతీయ స్థాయికి చేరింది. బెంగళూరులోని నిపుణులు అంతర్జాతీయ ఐటీ సంస్థల టాలెంట్తో నేరుగా పోటీపడటం ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో సాంకేతిక రంగం ఒక్కటే 5.8 మిలియన్ల మందికి పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ ఐటీ విప్లవం ఉద్యోగ స్వభావాన్ని కూడా మార్చేసింది. ఒకే హోదాలో నిలిచిపోయే పాత పద్ధతి పోయి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరంగా మారింది. ఇప్పుడు ఉద్యోగాల హోదాల కంటే వ్యక్తికి ఉన్న నైపుణ్యాలకే ఎక్కువ విలువ లభిస్తోంది.
స్కిల్ గ్యాప్, ఐటి సవాళ్లు
ఒకవైపు ఐటీ విప్లవం వచ్చినప్పటికీ, మరోవైపు నైపుణ్యాల కొరత స్పష్టంగా కనిపించింది. 2005లో దేశంలో దాదాపు 105 మిలియన్ల మంది వర్కింగ్ పూర్ ఉన్నారని ఐఎల్ఓ పేర్కొంది. వీరు పనిచేస్తున్నప్పటికీ కనీస పేదరిక రేఖకు సరిపడా ఆదాయం పొందలేకపోయారు. ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ రిపోర్టు ప్రకారం, భారత వర్క్ఫోర్స్లో 88 శాతం మంది తక్కువ నైపుణ్యం కలిగిన పనుల్లోనే ఉన్నారు.
కేవలం 10 నుండి 12 శాతం మందికి మాత్రమే అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు దక్కాయి. 2024 ఐఎల్ఓ రిపోర్టు ప్రకారం, నిరక్షరాస్యత ఉన్న యువతలో నిరుద్యోగిత 3.4 శాతంగా ఉంటే, డిగ్రీ చదివిన యువతలో అది 29.1 శాతంగా ఉంది. టైప్రైటర్ల నుండి ఏఐ వరకు సాంకేతికత మారినా, ఎంప్లాయర్ కోరుకునే స్కిల్స్, వర్కర్ల వద్ద ఉన్న స్కిల్స్ మధ్య తేడా అలానే ఉంది.
ఏఐ యుగం: 2047 వైపు భారత్
ప్రస్తుతం ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు సైతం ప్రభావితమవుతున్నాయి. అనేక సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. దీనివల్ల ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్, చిన్న వ్యాపారాల వైపు యువత మొగ్గు చూపుతున్నారు. అయితే బ్లూ కాలర్, గ్రే కాలర్ ఉద్యోగాలు (డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, ఫ్యాక్టరీ కార్మికులు) సురక్షితంగానే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
పలు రిపోర్టుల ప్రకారం.. ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా పోవడం లేదు, కానీ పనుల విభజన జరుగుతోంది. ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సాంకేతికతల్లో నైపుణ్యం ఉన్నవారికి జీతాలు 30 నుండి 40 శాతం పెరిగాయి.
వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి దేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) దాదాపు 2.8 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తాయని అంచనా. ఉద్యోగాల ఎక్స్చేంజీల నుండి ఏఐ ఆధారిత రిక్రూట్మెంట్ వరకు భారత ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. కానీ రాబోయే తరం ఉద్యోగం నుండి ఎలాంటి భద్రతను కోరుకుంటుంది అనేది వేచి చూడాలి.

