Gold Price Hike: నిన్న రూ.3 వేలు.. ఇవాళ మరో రూ.వెయ్యి...సామాన్యులపై బంగారం బాదుడు
Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. పసిడి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి వరుసగా రెండో రోజూ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మంగళవారం బంగారం ధరలు రూ.3 వేలకుపైగా పెరగగా.. బుధవారం కూడా మరోసారి భారీగా ఎగబాకాయి.

సామాన్యులపై బంగారం బాదుడు
అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కూడా పసిడి ధరలకు సపోర్ట్ గా నిలుస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అంటే MCXలో గోల్డ్, సిల్వర్ ధరలు దాదాపు ఒక శాతం మేర పెరిగాయి. దీంతో బులియన్ మార్కెట్లో మరోసారి కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలపై మార్కెట్ వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.1,54,860కి చేరిన మేలిమి బంగారం
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,040 పెరిగి రూ.1,54,860కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.950 పెరుగుదలతో రూ.1,41,196 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలో రూ.2.60 లక్షల స్థాయిలో కొనసాగుతోంది.
పసిడి ధరలకు ఊతమిస్తున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు
ఇక అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే.. మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా పసిడి ధరలకు కలిసొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దీంతో గోల్డ్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా డాలర్ కదలికలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి కూడా పసిడి మార్కెట్పై ప్రభావం చూపుతోంది. దీనికి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి.
రూ.1,58,000 మార్క్ దాటే అవకాశం
ఈ పరిణామాల నేపథ్యంలో MCXలో అక్టోబర్ ఫ్యూచర్స్ గోల్డ్ కాంట్రాక్టులు రూ.1,58,000 మార్క్ను దాటే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలను బట్టి ధరల్లో మార్పులు రావచ్చు.

