- Home
- Business
- Petrol Price: అసలు సినిమా ముందుందా.? పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపించనున్నాయా?
Petrol Price: అసలు సినిమా ముందుందా.? పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపించనున్నాయా?
Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే లీటరుకు రూ.3కుపైగా పెరిగాయి. అయితే ఇది ధరల పెరుగుదలకు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముడి చమురు సంక్షోభం.. భారత్పై భారీ ప్రభావం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్ అస్థిరంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడుతున్న అనిశ్చితి కారణంగా ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నెలల క్రితం వరకు బ్యారెల్ ముడి చమురు ధర 65 నుంచి 70 డాలర్ల మధ్య ఉండగా, ఇప్పుడు అది 110 డాలర్లకు పైగా చేరుకుంది. కొంతకాలం క్రితం ఒక దశలో 125 డాలర్ల మార్క్ను కూడా తాకింది. భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల నేరుగా దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపుతోంది.

చమురు కంపెనీలకు పెరుగుతున్న నష్టాలు
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు ముడి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, దేశీయంగా అదే స్థాయిలో ధరలు పెంచలేక కంపెనీలు నష్టాలను భరిస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు రూ.1000 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల వెల్లడించారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం జరిగిన రూ.3 పెంపుతో కంపెనీలకు కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ వాస్తవ నష్టాలను పూర్తిగా భర్తీ చేయాలంటే ఇంకా భారీ స్థాయిలో ధరలు పెంచాల్సి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రూపాయి పతనం కూడా పెద్ద కారణమే
ఇంధన ధరల పెరుగుదలకు కేవలం ముడి చమురు ధరలే కారణం కావు. డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటం కూడా దిగుమతి వ్యయాన్ని పెంచుతోంది. గతంలో డాలర్ మారకం విలువ తక్కువగా ఉండగా, ఇప్పుడు రూపాయి మరింత బలహీనపడడంతో చమురు దిగుమతి ఖర్చు గణనీయంగా పెరిగింది. దీంతో కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ఆర్థిక సంస్థలు చేసిన అంచనాల ప్రకారం, పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో లీటరుకు మరో రూ.20 నుంచి రూ.25 వరకు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
పెరిగే ఇంధన ధరల ప్రభావం సామాన్యుడిపైనే
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాని ప్రభావం కూరగాయలు, పాలు, ధాన్యాలు, కిరాణా సరుకులు, నిర్మాణ సామగ్రి ధరలపై పడుతుంది. పెట్రోల్ ధరలు పెరగడంతో పట్టణాల్లో రోజువారీ ప్రయాణ ఖర్చులు కూడా పెరుగుతాయి. క్యాబ్ ఛార్జీలు, డెలివరీ సేవలు, ఆటో చార్జీలు అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
మళ్లీ ధరల సమీక్షకు సిద్ధమవుతున్న ప్రభుత్వం?
ఇంధన ధరలను ఇకపై తరచుగా సమీక్షించే అవకాశాలున్నాయని కేంద్ర వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. గతంలో ఎక్కువ కాలం ధరలు స్థిరంగా ఉంచినా, ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలపై సమీక్ష జరగొచ్చని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల ప్రజలకు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని సూచించారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి విధానాలను పరిశీలించాలని సంస్థలకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లో పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే, దేశంలో ఇంధన ధరల మోత ఇంకా కొనసాగొచ్చనే అభిప్రాయం బలపడుతోంది. ప్రస్తుతం జరిగిన పెంపు కేవలం మొదటి దశ మాత్రమే అయ్యే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

