- Home
- Business
- Today Gold Rate: పసిడి దిగుమతులపై కేంద్రం పరిమితులు..ఒక్కరోజులో కుప్పకూలిపోయిన బంగారం ధరలు
Today Gold Rate: పసిడి దిగుమతులపై కేంద్రం పరిమితులు..ఒక్కరోజులో కుప్పకూలిపోయిన బంగారం ధరలు
Today Gold Rate: నాలుగు రోజుల్లో రూ.10 వేలు పెరిగిన బంగారం… ఒక్కరోజులోనే ఎందుకు కుప్పకూలింది? ఇకపై గోల్డ్ కొనాలా వద్దా? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది.

పాతాళానికి పడిపోయిన పసిడి
గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో మార్కెట్లో చర్చ మొదలైంది. వరుసగా నాలుగు రోజుల పాటు దాదాపు రూ.10 వేల వరకు పెరిగిన గోల్డ్ రేట్లు, ఇప్పుడు అనూహ్యంగా పడిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

కొత్త రికార్డులు నమోదు చేసిన బంగారం ధరలు
మే 11 తర్వాత వరుస పెరుగుదలతో బంగారం ధరలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అయితే మే 15 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.2,240 తగ్గి రూ.1,60,090 వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.2,050 మేర పడిపోయి రూ.1,46,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ బంగారం ధర కూడా భారీగా తగ్గి రూ.1,20,070 వద్దకు వచ్చింది.
దిగొస్తున్న వెండి ధరలు
బంగారంతో పాటు వెండి మార్కెట్లో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కిలో వెండి ధర దాదాపు రూ.10 వేల వరకు పతనమై ప్రస్తుతం రూ.3,05,000 స్థాయిలో కొనసాగుతోంది. అంటే తులం వెండి ధర రూ.3,050గా ఉంది. గత కొన్ని రోజులుగా వేగంగా పెరిగిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా దిగివచ్చాయి.
మార్కెట్పై ఒత్తిడి
ముఖ్యంగా అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగానే ఉండొచ్చన్న అంచనాలు బంగారం మార్కెట్పై ఒత్తిడి పెంచుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడుతుంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం కంటే ఇతర ఆస్తులవైపు మొగ్గు చూపుతారు. ఇదే ప్రస్తుతం గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్న ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దిగుమతులపై పరిమితి
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కూడా గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో పాటు, అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద గోల్డ్ దిగుమతులకు 100 కిలోల పరిమితి విధించింది. ఇంతకుముందు ఈ పథకంలో ఎలాంటి పరిమితి లేకపోవడం వల్ల జువెలరీ ఎగుమతిదారులు భారీగా దిగుమతులు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పరిమితం చేయడం మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.
ఈ పతనం తాత్కాలికమేనా?
మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు, విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో బంగారం దిగుమతులను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా…ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… ఈ పతనం తాత్కాలికమేనా? లేక బంగారం ధరల్లో ఇంకా మార్పులు జరగనున్నాయా అని. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.

