- Home
- Business
- కళ్లు చెదిరే బంగారం నిల్వలు.. వెలికి తీస్తే భూమ్మీదున్న అందరికీ రూ. 4 కోట్లు పంచొచ్చు. ఎక్కడంటే.?
కళ్లు చెదిరే బంగారం నిల్వలు.. వెలికి తీస్తే భూమ్మీదున్న అందరికీ రూ. 4 కోట్లు పంచొచ్చు. ఎక్కడంటే.?
Gold: బంగారం ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. పూర్వం రాజుల నుంచి నేటి సాధారణ ప్రజల వరకు అందరికీ బంగారం అంటే పిచ్చి. అయితే సముద్ర గర్భంలో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారం ఉందని మీకు తెలుసా.?

అపార సంపదకు నిలయం సముద్రం
ప్రపంచంలోని దేశాలు తమ ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటాయి. భూగర్భ గనుల్లో బంగారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. కానీ మన కళ్లముందే విస్తరించి ఉన్న సముద్రంలో, భూమిపై ఉన్న అన్ని గనులకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బంగారం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం సముద్ర జలాల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. భూమి మీద సుమారు 70 శాతం భాగం నీటితో కప్పబడి ఉంటుంది. ఆ నీలి విస్తీర్ణం కేవలం ఉప్పు నీటి కేంద్రం కాదు. అది అనేక ఖనిజాలకు, విలువైన లోహాలకు నిలయం. అందులో బంగారం కూడా ఒకటి.
ప్రతి మనిషికి 4 కిలోల బంగారం పంచొచ్చు
సముద్రంలో ఉన్న మొత్తం బంగారాన్ని బయటకు తీసి ప్రపంచ జనాభాకు సమానంగా పంచితే, ఒక్కొక్కరికి సుమారు 4 కిలోల బంగారం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సముద్రంలో బంగారం కనిపించే రూపంలో ఉండదు. నీటిలో కరిగిపోయిన అత్యంత సూక్ష్మ కణాలుగా ఉంటుంది. అందుకే ఈ సంపద మన చేతికి అందకుండా ఉండిపోతోంది.
అచ్చంగా రక్తంలో ఉన్నట్లు
మనిషి శరీరంలో రక్తంలో బంగారం సూక్ష్మ పరిమాణంలో ఉన్నట్టే, సముద్రపు నీటిలో కూడా బంగారం అతి తక్కువ నిష్పత్తిలో కలిసిపోయి ఉంటుంది. ఒక గ్రాము బంగారం పొందాలంటే దాదాపు 100 మిలియన్ మెట్రిక్ టన్నుల సముద్రపు నీటిని శుద్ధి చేయాల్సి వస్తుంది. ఈ స్థాయి తక్కువ నిష్పత్తి కారణంగా బంగారాన్ని వేరు చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన పని. ప్రస్తుతం ఉన్న పద్ధతులతో ఇది ఆచరణలో సాధ్యం కావడం లేదు.
ఎప్పుడైనా ప్రయత్నించారా.?
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ భారీ అప్పుల భారంతో కుంగిపోయింది. ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో సముద్రపు నీటిలో నుంచి బంగారం వెలికితీయాలనే ఆలోచన వచ్చింది. ఈ పరిశోధనకు ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ నాయకత్వం వహించారు. అయితే ఒక గ్రాము బంగారం తీయడానికి అయ్యే ఖర్చు, ఆ బంగారం మార్కెట్ విలువ కన్నా వంద రెట్లు ఎక్కువ అని తేలింది. అంటే లక్షలు ఖర్చు పెట్టి వేల రూపాయల విలువైన బంగారం పొందడమే అవుతుంది. ఈ వాస్తవంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది.
పొంచి ఉన్న ప్రమాదం
సముద్రపు నీటిలోనే కాదు, సముద్ర గర్భంలోని రాళ్లలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. కానీ మైళ్ల లోతుకు వెళ్లి మైనింగ్ చేయడం అంటే ప్రాణాలను ప్రమాదంలో పెట్టడమే. ఇంతేకాదు, సముద్ర గర్భాన్ని తవ్వడం వల్ల అక్కడి జీవ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. అరుదైన జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రకృతికి తిరిగి పూడ్చలేని నష్టం. అందుకే సముద్రపు బంగారం ఇప్పటికీ అందని సంపదగానే మిగిలింది. అయితే భవిష్యత్తులో నానోటెక్నాలజీ లేదా ప్రత్యేక బ్యాక్టీరియా ఆధారిత పద్ధతులు అభివృద్ధి అయితే తక్కువ ఖర్చుతో బంగారం వెలికితీయగల అవకాశాలు రావచ్చు. అప్పటి వరకు ఆ బంగారం అలా సముద్ర గర్భంలోనే ఉండిపోతుంది.

