WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్లోనే పీఎఫ్ సేవలు
EPFO WhatsApp Services: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు అందిస్తామని వెల్లడించింది. అలాగే, యూపీఐ ద్వారా ఈజీగా డబ్బుల విత్డ్రా సదుపాయం తీసుకురానుంది. ఆ వివరాలు మీకోసం.

పీఎఫ్ సేవలపై సూపర్ న్యూస్ చెప్పిన కేంద్రం
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. ఇకపై మీ మొబైల్లోని వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అంతేకాదు, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి విత్డ్రా చేసుకునే సేవలు కూడా రాబోతున్నాయి.
ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు ఒక నెల రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.

వాట్సాప్లోనే పీఎఫ్ సేవలు
ఈపీఎఫ్ఓ యూజర్ల కోసం వాట్సాప్ ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని సంస్థ నిర్ణయించింది. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చూడటం, చివరి ఐదు ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలుసుకోవడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవడం వంటి పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఒక నెల రోజుల్లోనే ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
యూజర్ల భద్రత కోసం ఒక ప్రత్యేక సిస్టమ్ పనిచేస్తుందని అధికారులు చెప్పారు. సభ్యులు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పంపినప్పుడు, ఆ నంబర్ వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్ కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబరేనా కాదా అని ఈపీఎఫ్ఓ వెరిఫై చేస్తుంది. అది కరెక్ట్ అయితే, వెంటనే స్థానిక భాషలోనే సింపుల్ మెనూ ఆప్షన్లు కనిపిస్తాయి. చాట్బాట్ లేదా ఈపీఎఫ్ఓ డేటాబేస్ ద్వారా ఏఐ సాయంతో మీ ప్రశ్నలకు వెంటనే రిప్లై వస్తుంది.
పీఎఫ్ మనీ: యూపీఐ ద్వారా విత్డ్రా
ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి, వాటిని నేరుగా బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడానికి త్వరలోనే యూపీఐ పేమెంట్ గేట్వేలను అనుమతించనున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే సక్సెస్ఫుల్గా పూర్తయింది.
"యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా సభ్యులు ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే సదుపాయంపై టెస్టింగ్ పూర్తి చేశాం. విత్డ్రా చేసిన అమౌంట్ నేరుగా సభ్యుని బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది" అని మంత్రి వివరించారు. దీనివల్ల పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
తగ్గిన కోర్టు కేసులు
ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన "నిధి ఆప్కే నికట్ (NAN)" లాంటి ప్రత్యేక కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా వివిధ వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య భారీగా తగ్గిందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1, 2024 నాటికి 4,936 గా ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య, మార్చి 31, 2026 నాటికి 2,646 కి తగ్గిపోయింది.
అలాగే, మొత్తం కోర్టు కేసుల పెండెన్సీ ఏప్రిల్ 1, 2025 నాటికి 31,036 కేసులు ఉండగా, ఏప్రిల్ 1, 2026 నాటికి అది 27,639 కి తగ్గింది. అంటే దాదాపు 3,397 కేసులు తగ్గాయి. ఈపీఎఫ్ఓ చరిత్రలోనే కేసుల సంఖ్య ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి అని మంత్రి మాండవీయ సంతోషం వ్యక్తం చేశారు.
కొత్త పోర్టళ్లు.. టార్గెటెడ్ సపోర్ట్
నాలుగు లేబర్ కోడ్లకు అనుగుణంగా మే 9న శ్రమ్ సువిధ 2.0 (SSP 2.0), సమాధాన్ 2.0 పోర్టళ్లను అప్గ్రేడ్ చేసి లాంచ్ చేసినట్లు మంత్రి చెప్పారు. ఇవి కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత బలోపేతం చేస్తాయి. వ్యాపారాలను సులభతరం చేయడానికి ఇవి దోహదపడతాయి. మోడరన్, సురక్షితమైన డిజిటల్ ఆర్కిటెక్చర్తో వీటిని రూపొందించినట్టు తెలిపారు.
మరోవైపు, ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్గార్ యోజన కింద అర్హులైన సభ్యులకు వాట్సాప్ ద్వారా ప్రత్యేక సపోర్ట్ లభిస్తుంది. ఆధార్ అథెంటికేషన్ పూర్తి కాకపోవడం, లేదా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎనేబుల్ కాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారికి వాట్సాప్ ద్వారానే వాటిని పరిష్కరించేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోనుంది.

