E20 పెట్రోల్ అంటే ఏమిటి? మీ వాహనంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
E20 Petrol : ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఫ్యూయల్ మాత్రమే లభించనుంది. దీనివల్ల పాత వాహనాల ఇంజన్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

E20 పెట్రోల్ విప్లవం.. మీ వాహనం సురక్షితమేనా?
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఏప్రిల్ 1 ఒక చరిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంకులో ఇకపై 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ విక్రయించడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పర్యావరణ పరంగా ఇది శుభవార్తే అయినప్పటికీ, పాత వాహనాలు కలిగిన యజమానులలో మాత్రం కొంత ఆందోళన నెలకొంది.
అసలు E20 పెట్రోల్ అంటే ఏమిటి?
E20 పెట్రోల్లో 80 శాతం సాధారణ పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్, దీనిని ప్రధానంగా చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారు చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే దశలవారీగా ఇథనాల్ శాతాన్ని పెంచుతూ వస్తోంది. ఏప్రిల్ 2023 తర్వాత తయారైన BS6 ఫేజ్-2 వాహనాలు ఈ E20 ఇంధనానికి అనుగుణంగానే డిజైన్ చేశారు. కాబట్టి వాటికి ఎటువంటి ముప్పు ఉండదు. కానీ, అంతకంటే ముందు తయారైన పాత వాహనాల ఇంజన్లు కేవలం స్వచ్ఛమైన పెట్రోల్ కోసం రూపొందించటంతో సమస్య మొదలవుతుంది.
ఈ20 పెట్రోల్ : పాత వాహనాలపై పడే ప్రభావం ఇదే
నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజీలో 3 నుంచి 7 శాతం వరకు తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఇథనాల్ స్వభావరీత్యా ఆల్కహాల్ కావడంతో, ఇది పాత వాహనాల్లోని రబ్బరు పైపులు, సీల్స్, ప్లాస్టిక్ భాగాలను కాలక్రమేణా దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఇథనాల్కు గాలిలోని తేమను గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల ఫ్యూయల్ ట్యాంక్ లోపల నీరు చేరి, తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఉపయోగాలు ఏమిటి?
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం సుమారు 85 శాతం ముడి చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇథనాల్ వాడకం వల్ల బిలియన్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పర్యావరణ పరంగా చూస్తే, ఈ ఇంధనం మండటం వల్ల కార్బన్ ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయి, తద్వారా నగరాల్లో వాయు కాలుష్యం తగ్గుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇథనాల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను రైతుల నుండి సేకరిస్తారు, దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
పాత వాహనాలను ఎలా కాపాడుకోవాలి?
మీ వద్ద పాత వాహనం ఉన్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నపాటి మార్పులతో ఇంజన్ లైఫ్ ను పెంచుకోవచ్చు.
1. పైపుల మార్పిడి: మీ వాహనంలోని పాత ఫ్యూయల్ పైపులను తొలగించి, E20 ఇంధనానికి తట్టుకోగల కొత్త పైపులను అమర్చుకోవాలి.
2. ఫ్యూయల్ స్టెబిలైజర్: మార్కెట్లో లభించే ఫ్యూయల్ స్టెబిలైజర్లను వాడటం ద్వారా ట్యాంక్లో తేమ చేరకుండా చూడవచ్చు.
3. ఫ్యూయల్ ఫిల్టర్: ఫ్యూయల్ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం లేదా మార్చడం ద్వారా ఇంజన్లోకి చెత్త చేరకుండా జాగ్రత్త పడవచ్చు.
ఈటీ20 పెట్రోల్ : వాహనం నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
E20 ఇంధనం వాడితే వాహనాన్ని ఎక్కువ రోజులు పక్కన పెట్టడం ప్రమాదకరం. వాహనాన్ని క్రమం తప్పకుండా నడపడానికి ప్రయత్నించాలి. అలాగే, పెట్రోల్ ట్యాంక్ను ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచవద్దు. ట్యాంక్ నిండుగా ఉంటే తేమ చేరడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మీ పాత వాహనం ఇనుప ట్యాంక్ అయితే, దానికి యాంటీ కొరోజన్ ట్రీట్మెంట్ చేయించడం ఉత్తమం. ఇటువంటి చిన్న జాగ్రత్తలు మీ వాహనం ఈ కొత్త ఇంధన మార్పును తట్టుకునేలా చేస్తాయి.

