- Home
- Andhra Pradesh
- Weather Update: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Weather Update: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల జోరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రూటు మార్చింది. మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాబోయే కొన్ని రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం మరింత కూల్ కానుంది. నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడం, వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వానలు దంచికొట్టనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణ లోటు వర్షపాతానికి చెక్.. హైదరాబాద్లో వానలు
తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణంగా 402.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 379 మి.మీ వర్షపాతం మాత్రమే పడింది. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు వర్షాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
యాదాద్రి భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చెదురుమదురుగా జల్లులు కురిసాయి. రాబోయే రోజుల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీకి భారీ వర్ష సూచన: శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ వాతావరణం పూర్తిగా మారింది. అల్పపీడన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా కూల్ అయింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 14న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తుపాను ఈదురుగాలులు.. ఐఎండీ అలర్ట్
వర్షాలు కురిసే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీరప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఆదేశించింది.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, హోర్డింగ్స్ కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.
ఆగస్టు 14 వరకు వరకు పరిస్థితి ఎలా ఉండబోతోంది?
ఐఎండీ అమరావతి, హైదరాబాద్ బులెటిన్ల ప్రకారం ఆగస్టు 6 నుంచి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలాగే ముసురు పట్టి ఉండే అవకాశం ఉంది. తొలి ఐదు రోజులు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత వారం చివరి నాటికి సాధారణ వర్షాలు మాత్రమే నమోదు కావచ్చని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. హైదరాబాద్లో గరిష్ఠంగా 31°C నుండి 32°C, విజయవాడలో 32°C నుండి 33°C, తిరుపతి ప్రాంతంలో 34°C నుండి 35°C వరకు నమోదు కావచ్చు. పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో హఠాత్తుగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకునేటప్పుడు వెదర్ అప్డేట్స్ చూసుకోవడం మంచిది.

