- Home
- Andhra Pradesh
- Tirumala : ఈ వేసవిలో తిరుమలకు వెళుతున్నారా..? శ్రీవారి దర్శనం ఈజీగా పొందే టిప్స్ ఇవే
Tirumala : ఈ వేసవిలో తిరుమలకు వెళుతున్నారా..? శ్రీవారి దర్శనం ఈజీగా పొందే టిప్స్ ఇవే
Tirumala Travel Guide : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెెంకటేశ్వర స్వామి దర్శనానికి వెెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా…? అయితే ఈ సమ్మర్ రద్దీలోనూ శ్రీవారి దర్శనం ఈజీగా పొందే టిప్స్ మీకోసమే.

తిరుమల సమాచారం...
Tirumala : పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి... కాబట్టి చాలామంది కుటుంబంతో కలిసి తిరుమల యాత్ర ప్లాన్ చేస్తుంటాయి. అయితే సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది... కాబట్టి కుటుంబంతో కలిసి వెళ్లాలనుకునేవారు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు ఎలా పొందాలి..? ఆన్ లైన్ లో కాకుండా నేరుగా వెళ్లి ఎక్కడ తీసుకోవచ్చు..? టిటిడి అందించే సౌకర్యాలేమిటి..? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆన్లైన్ లో తిరుమల టికెట్లు ఎలా పొందాలి..?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం టికెట్లను మీరు ముందుగానే (Advance Booking) బుక్ చేసుకోవచ్చు. నిజానికి తిరుమలకు వెళ్లి చివరి నిమిషంలో దర్శనం టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందే బుక్ చేసుకోవడం ఉత్తమం. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan - రూ.300) : ఇవి సాధారణంగా 2 నుండి 3 నెలల ముందే విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దర్శించుకోవాలని అనుకుంటే ఇది మంచి ఆప్షన్.
ఆర్జిత సేవలు : శ్రీవారి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని అనుకునేవారు ప్రత్యేక సేవల టికెట్లు పొందవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవలు లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తారు. వీటికి కూడా కొన్ని నెలల ముందే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
నేరుగా శ్రీవారి దర్శన టికెట్లు ఎక్కడ పొందాలి..?
ముందుగా ఆన్లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు లేకుండా నేరుగా తిరుమల యాత్ర చేపట్టేవారు తిరుపతిలోనే అలర్ట్ కావాలి. ఎందుకంటే అక్కడే భక్తులకు సర్వదర్శనం (SSD Tokens) టికెట్లు లభిస్తాయి. తిరుపతి ఆర్టిసి బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం లేదా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర్లోని విష్ణు నివాసంలో ఫ్రీ దర్శనం టోకెన్లు లభిస్తాయి. మామూలుగా అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఏ సమయంలో అయినా టోకేన్స్ జారీ చేస్తారు... అయితే ప్రస్తుతం వేసవి ఎండల నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ టోకెన్స్ పంపిణీ చేపడుతున్నారు.
తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు పొందలేనివారు తిరుమలలో పొందవచ్చు. అలిపిరి బస్టాండ్ వద్దగల భూదేవి కాంప్లెక్స్ లో కూడా దర్శన టికెట్ల పంపిణీ జరుగుతుంది. ఈ టోకెన్స్ తీసుకుని ఏడుకొండలపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ ఉచిత దర్శన టోకెన్లు ఎవరు ముందుగా వస్తే వారికే అందుతాయి... కాబట్టి భక్తులు వీలైనంత ముందే పంపిణీ ప్రాంతాలకు చేరుకుంటే మంచిది.
శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు...
ఆన్లైన్, ఆఫ్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు పొందలేకున్నా సరే... స్వామిని దర్శించుకోవచ్చు. కానీ ఇది కొంచెం కాస్ట్లీ వ్యవహారం. శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ కు రూ.10000 విరాళం ఇచ్చి విఐపి బ్రేక్ దర్శన టికెట్ పొందవచ్చు. విరాళం దాత, వారి కుటుంబసభ్యులకు ఉదయం సుప్రభాత సేవ తర్వాత శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తారు.
తిరుమలలో వసతి ఎలా..?
తిరుమలలో భక్తుల వసతి కోసం టిటిడి ఏర్పాట్లు చేసింది... అనేక భవనాల్లో వసతి కల్పిస్తున్నారు. దర్శనం మాదిరిగానే గదులను కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు... లేదంటే నేరుగా వెళ్ళి టోకెన్లు పొంది రూం తీసుకోవచ్చు.
బుకింగ్ లేకుండా నేరుగా తిరుమలలో వసతి కావాలంటే ఉదయం 6 నుండి 10 గంటల వరకు సిఆర్వో (సెంట్రల్ రిసెప్షప్ ఆఫీస్) వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. గదులు అందుబాటులో ఉంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్దతిలో కేటాయిస్తారు. తిరుమలలో ఉచిత వసతి కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి.
ఒకవేళ ఉచిత గది లభించలేదంటే వస్తువులను దాచుకునేందుకు లాకర్ సదుపాయం ఉంటుంది. యాత్రి సదన్, శ్రీ పద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం... ఇలా చాలాచోట్ల భక్తులకు లాకర్ సదుపాయం కల్పిస్తారు. ఇక్కడ తమ వస్తువులు దాచుకుని భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు.

