PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి
PM Kisan Samman Nidhi : కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు పీఎం కిసాన్ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది.. ఇందుకు సంబంధించిన 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. మీ అకౌంట్లో ఈ డబ్బులు పడకుంటే ఏం చేయాలో తెలుసా?

రైతుల అకౌంట్ లో డబ్బులే డబ్బులు..
PM Kisan : తెలుగు ప్రజలకు ఉగాది, రంజాన్ పండగలు ముందే వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమకాగా, తెలంగాణ రైతుల అకౌంట్లలో రూ.2 వేలు పడ్డాయి. ఇలా సరిగ్గా పండగల సమయంలో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఏపీ ప్రభుత్వం 'అన్నదాత-సుఖీభవ' డబ్బులు పడటంతో రైతుల ముఖంలో ఆనందం విరిసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందాయి.
అయితే కొందరు రైతులకు వివిధ కారణాలతో ఈ పెట్టుబడి సాయం అందలేదు... అలాంటివారు కంగారుపడాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని ఫోన్ లోనే సమస్యను తెలుసుకోవచ్చు.... పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (మార్చి 13, శుక్రవారం) అస్సాం రాజధాని గువహటిలో అధికారికంగా నిధులు విడుదల చేశారు... దీంతో దేశంలోని 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు నేరుగా జమ అయ్యాయి. వీరిలో 2.15 కోట్లకు పైగా మహిళా రైతులు ఉన్నారు. 2019లో ఈ పథకం ప్రారంభంకాగా ఇప్పటివరకు 22 విడతలు పూర్తయ్యాయి... మొత్తం రూ.4.27 లక్షల కోట్లకు పైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
అయితే మీకు ప్రతి విడతలో పీఎం కిసాన్ డబ్బులు పడి ఈసారి పడకుంటే కంగారుపడిపోకండి. ఇందుకు కారణమేంటో తెలుసుకొని అది పరిష్కరించుకుంటే హోల్డ్ లో ఉన్న డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. ఇందుకోసం ముందుగా స్మార్ట్ ఫోన్లో pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్పేజీలో 'Know Your Status' ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి. స్క్రీన్పై కనిపించే క్యాప్చా కోడ్ను నింపండి. మీ ఫోన్కు వచ్చే OTPని ఎంటర్ చేయగానే, మీ పూర్తి స్టేటస్ కనిపిస్తుంది. అందులో మీకు పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడలేవో కారణం కనిపిస్తుంది.
సమస్యను పరిష్కరించుకునే మార్గమిదే...
మీ వివరాలన్ని సరిగ్గానే ఉన్నా పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ కాకుంటే కంగారుపడకండి. ప్రభుత్వం ఇలాంటి రైతుల సహాయం కోసమే టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులో ఉంచింది. కాబట్టి వెంటనే 1800-115-526 నంబర్కు ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు. వారి సలహాలు, సూచనలు పాటించి పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు.
ఏపీ రైతులకు ఏకంగా రూ.6 వేల సాయం...
దేశవ్యాప్తంగా రైతులకు కేవలం రూ.2 వేలు అందితే ఏపీ రైతులకు మాత్రం రూ.6 వేలు అందాయి. పీఎం నరేంద్ర మోదీ పీఎం కిసాన్ కింద రూ.2 వేలు విడుదల చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు వాటికి మరో రూ.4 వేలు జతచేసి రూ.6 వేలు వేశారు. కృష్ణా జిల్లా సూరంపల్లి సమీపంలోని మాదాల వారి గూడెంలో మూడువేల మందికిపైగా రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు... ఇందులోని సీఎం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు.
అన్నదాత సుఖీభవ మూడవ విడతలో భాగంగా 46.85 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర వాటా కింద రూ.6,000 చొప్పున జమ అయ్యాయి. మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి... ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రెండు విడతలు కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది... తాజాగా రూ.6 వేలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 అందించినట్లు అయ్యింది.
తెలంగాణలో రైతు భరోసా ఎప్పుడు..?
తెలంగాణ ప్రజలకు పీఎం కిసాన్ అయితే అందింది... ఇక రైతు భరోసా మిగిలింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి... తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి దీనిపై ఆసక్తికర ప్రకటన చేశారు. మార్చి నెలాఖరులోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలల్లో జమ అవుతాయని... ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాబట్టి రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు.

