- Home
- Andhra Pradesh
- Mithun Reddy: టీవీ, ప్రోటీన్ పౌడర్, పెన్నులు.. మిథున్ రెడ్డికి జైల్లో కల్పించే సౌకర్యాలు ఏంటంటే.?
Mithun Reddy: టీవీ, ప్రోటీన్ పౌడర్, పెన్నులు.. మిథున్ రెడ్డికి జైల్లో కల్పించే సౌకర్యాలు ఏంటంటే.?
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కలకలం రేపుతోంది. గత హయాంలో మద్యం విధానంలో అవకతకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us

మద్యం కుంభకోణం కేసులో అరెస్టు, రిమాండ్
ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్కి పంపిస్తూ విజయవాడ అవినీతి నిరోధక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు, విచారణ అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి 4196 నంబర్ కేటాయించారు.
కోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి
జైలులో తగిన సదుపాయాలు కల్పించాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా పిటీషన్ దాఖలు చేశారు. ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వీటిని అనుమతించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు, కొన్ని ప్రత్యేక సదుపాయాలను మంజూరు చేస్తూ జైలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు అనుమతించిన ప్రత్యేక సదుపాయాలు
వ్యక్తిగత బెడ్, వెస్ట్రన్ కమోడ్, టీవీ, దోమ తెర, యోగా మ్యాట్, రోజుకు మూడు పూటలా ఇంటి భోజనం, ప్రోటీన్ పౌడర్, రెగ్యులర్ మెడిసిన్, వాకింగ్ షూస్, మినరల్ వాటర్, వార్తా పత్రికలు, నోట్ బుక్స్, పెన్లు, వారంలో ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీ సమావేశాలకు అనుమతిచ్చారు. అదే విధంగా ఒక పర్యవేక్షకుడుని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు.
జైలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ఈ సదుపాయాలపై ఎమైనా అభ్యంతరాలు ఉంటే మంగళవారం ఉదయం 10:30 గంటల లోపు కోర్టుకు నివేదించాలని, లేనిపక్షంలో వాటిని అమలు చేయాల్సిందిగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
వైసీపీ తీవ్ర విమర్శలు
మిథున్ రెడ్డిని ఏ-4 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆరోపించింది. "సూపర్ సిక్స్" పేరిట అమలు చేస్తున్న పాలన ప్రజల్లో ప్రతిస్పందన పొందకపోవడంతో ప్రభుత్వంపై వచ్చే విమర్శలను దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని పార్టీ ఆరోపిస్తోంది.