- Home
- Andhra Pradesh
- తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. రూపాయి ఖర్చు లేకుండానే ఐఏఎస్, ఐపిఎస్ కలను నిజం చేసుకొండి
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. రూపాయి ఖర్చు లేకుండానే ఐఏఎస్, ఐపిఎస్ కలను నిజం చేసుకొండి
Free Civils Coaching : మీరు సివిల్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే మీకు ఇదే అద్భుత అవకాశం. రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వసతి, భోజనంతో కూడిన సివిల్స్ కోచింగ్ పొందవచ్చు. ఇందుకోసం మీ ఏం చేయాలంటే..

తెలుగు యువతీయువకులకు ఫ్రీ సివిల్స్ కోచింగ్
Civils coaching : చాలామంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు.. ఇందుకోసమే ప్రత్యేకంగా సన్నద్దం అవుతుంటారు. బాగాచదివే కొందరు దేశంలోనే అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపిఎస్ సాధించాలని కలలు కంటుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందులు పేద, మధ్యతరగతి యువత ప్రభుత్వ ఉద్యోగాల కలలపై నీళ్లు చల్లుతుంటాయి... లక్ష్యసాధనలో వారిని వెనక్కి నెడుతుంటాయి. ఇలాంటి తెలుగు విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి సిబిఆర్ అకాడమీ, డా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్.
200 మంది యువతీయువకులకు ఫ్రీ కోచింగ్..
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువతీయువకులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి చలసాని బలరామ ప్రసాద్ (CBR) అకాడమీ, డా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్. సివిల్స్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న 200 మందిని ఎంపికచేసి కోచింగ్ ఇవ్వనున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. మూడేళ్లపాటు వసతి, ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని... నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ ఫ్రీ సివిల్స్ కోచింగ్ కు సంబంధించిన బ్రోచర్ ను మంత్రులు సత్యకుమార్ యాదవ్, పార్థసారథి చేతులమీదుగా విడుదల చేశారు.
ఫ్రీగా సివిల్స్ కోచింగ్ పొందాలంటే ఏం చేయాలి..?
చలసాని బలరామ ప్రసాద్ అకాడమీ, డా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో చేపట్టే ఫ్రీ సివిల్స్ కోచింగ్ కోసం ప్రత్యేక ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థుల నుండి ముందుగా దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.. ఇందులో అర్హత సాధిస్తే ఫ్రీ కోచింగ్ అవకాశం లభిస్తుంది. మూడేళ్లపాటు వసతి, ఫుడ్ తో పాటు కోచింగ్ ఉచితం.
మొత్తం 200 మందిని ఈ ఉచిత సివిల్స్ కోచింగ్ కోసం ఎంపికచేస్తారు... వీరిలో తప్పకుండా 100 మంది అమ్మాయిలు ఉంటారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మార్చి, ఏప్రిల్ లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మార్చి 15న అమ్మాయిలు, ఏప్రిల్ 5 అబ్బాయిలకు రాత పరీక్ష ఉంటుందని నిర్వహకులు ప్రకటించారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన యువతీయువకులను పర్సనల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఇలా రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపించే ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
విజయవాడ, వినుకొండలో శిక్షణ కేంద్రాలు..
ఉచిత సివిల్స్ కోచింగ్ కోసం రెండు సెంటర్లను ఎంపికచేశారు. విజయవాడలోని కేంద్రంలో అమ్మాయిలకు, వినుకొండలోని కేంద్రంలో అబ్బాయిలకు శిక్షణ ఇస్తారు. ప్రముఖ సామాజిక సేవకులు చలసాని బలరామ ప్రసాద్ (84 ఏళ్లు) అభ్యర్థులకు ఉచిత భోజనం, బస సదుపాయాన్ని కల్పిస్తుండగా డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ స్టడీ సర్కిల్ ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
సాధారణంగా ఒక్క అభ్యర్థికి మూడేళ్లపాటు ఉచిత వసతి, బస సదుపాయాలు కల్పిస్తూ శిక్షణ ఇచ్చేందుకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 200 మందికి అంటే కోట్లలో ఖర్చవుతుంది. అయినా ఈ మొత్తాన్ని నిర్వహకులే భరిస్తూ యువతకు ఉచితంగానే అన్ని సేవలు అందిస్తున్నారు... వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నారు. ఈ అవకాశాలన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు.
మంత్రి సత్యకుమార్ స్పూర్తితో..
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పూర్తితోనే ఈ ఉచిత సివిల్స్ కోచింగ్ ను ప్రారంభిస్తున్నారు నిర్వహకులు. తాను ప్రాతినిధ్య వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 28 మంది యువతీయువకులకు సత్యకుమార్ శిక్షణ ఇప్పిస్తున్నారు. గత 9 నెలలుగా హైదరాబాద్ లోని డాక్టర్ లక్ష్మయ్య అకాడమీలో వీళ్లు శిక్షణ పొందుతున్నారు... మరో రెండేళ్లపాటు ఇలాగే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ మరో 200 మందికి సివిల్స్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం రూపుద్దిద్దుకుంది.

