IMD Rain Alert : రాబోయే 24 గంటల్లో కుండపోత.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఫిబ్రవరి 20న తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

వెదర్ అప్డేట్...
దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి… చలి పూర్తిగా తగ్గి ఎండలు మొదలయ్యాయి. ఇలా వేసవి ఆరంభంలో ఎండలు మండిపోతున్నవేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది… వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా ఇప్పుడు దక్షిణాదిలో కూడా మొదలవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని… రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అల్పపీడనం కారణంగా ఫిబ్రవరి 20న దక్షిణ తమిళనాడు, తీరప్రాంతాలు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా తమిళనాడు సమీపంలోని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
మత్స్యకారులకు హెచ్చరిక
ఈరోజు నుంచి ఫిబ్రవరి 20 వరకు మన్నార్ గల్ఫ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరప్రాంతాలు, కుమరిన్ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఏపీ తీరప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి ఈ రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ వాతావరణం
రేపు, ఎల్లుండి (గురు, శుక్రవారం) హైదరాబాద్ తో పాటు శివారుప్రాంతాల్లో ఉదయం పూట తేలికపాటి పొగమంచు కమ్ముకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందట. గరిష్ట ఉష్ణోగ్రత 33-34°C, కనిష్ట ఉష్ణోగ్రత 20-25°C మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

