- Home
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్లో మరో భారీ డేటా సెంటర్.. డేటా రాజధానిగా నగరం. ప్రాంత రూపురేఖలు మారాల్సిందే
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ డేటా సెంటర్.. డేటా రాజధానిగా నగరం. ప్రాంత రూపురేఖలు మారాల్సిందే
Andhra pradesh: విశాఖపట్నంపై ప్రపంచ టెక్ దిగ్గజాల దృష్టి కేంద్రీకృతమవుతోంది. మూడు నుంచి నాలుగు ఏళ్లలో ఈ నగరం అత్యంత కీలక డేటాసెంటర్ క్లస్టర్గా అవతరించబోతోంది. భారీ పెట్టుబడులు వరుసగా ప్రవేశిస్తుండటం పరిశ్రమ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రిలయన్స్ భారీ అడుగు
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ కనెక్షన్స్తో కలసి 400 ఎకరాల్లో హైపర్స్కేల్ డేటాసెంటర్ నిర్మించేందుకు ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలు:
సామర్థ్యం: 1,000 మెగావాట్లు
పెట్టుబడి: రూ. 98,000 కోట్లు
పూర్తిస్థాయి నిర్మాణ లక్ష్యం: 2030
జామ్నగర్ 1,000 మెగావాట్ల సెంటర్కు అనుసంధానం
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు కావాల్సిన భూములు, మౌలిక సదుపాయాలపై ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు, సంస్థ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. తుది చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
క్యూ కడుతోన్న అంతర్జాతీయ సంస్థలు
రిలయన్స్తో పాటు మరిన్ని టెక్ దిగ్గజాలు కూడా విశాఖను తమ తదుపరి గమ్యంగా ఎంచుకున్నాయి. ఇప్పటి వరకు పెట్టుబడులను ప్రకటించిన కంపెనీలు..
* గూగుల్ – రూ. 1.33 లక్షల కోట్లు, 1,000 మెగావాట్ల అధునాతన ఏఐ డేటాసెంటర్
* బ్రూక్ఫీల్డ్ – రూ. 1.10 లక్షల కోట్లు, విశాఖలో భారీ డేటాసెంటర్ నిర్మాణం
* సిఫీ టెక్నాలజీస్ – రూ. 16,000 కోట్లు, డేటాసెంటర్ కాంప్లెక్స్కు భూమిపూజ పూర్తైంది.
ఈ పెట్టుబడులతో మొత్తం 3,000 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ఖరారైంది.
మౌలిక వనరులు
విశాఖలో ఏర్పాటు కాబోయే హైపర్స్కేల్ సెంటర్లలో అత్యాధునిక కంప్యూట్ టెక్నాలజీ ప్రవేశించనుంది. వీటిలో జీపీయూ, టీపీయూ ఆధారిత భారీ కంప్యూట్ శక్తి. ఏఐ ప్రాసెసర్లతో పురోగతి చెందిన డేటా స్టోరేజ్, మాడ్యులర్ సిస్టమ్లు, భారీ విద్యుత్ ఫీడర్లు, ప్రత్యేక సబ్స్టేషన్లు ఉండనున్నాయి. అధికారుల అంచనా ప్రకారం, రిలయన్స్ ప్రాజెక్టు ఆసియా స్థాయిలో అత్యంత శక్తివంతమైన ఏఐ డేటా నెట్వర్క్లలో ఒకటిగా నిలుస్తుంది.
ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రం 2030 నాటికి 6,000 మెగావాట్ల డేటాసెంటర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటికే 3,000 మెగావాట్లు ఖరారు అయ్యింది. మిగిలిన సామర్థ్యానికి సంబంధించి మూడు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. భూముల ఎంపిక, అనుమతుల ప్రక్రియను అధికారులు వేగవంతంగా జరుపుతున్నారు. రాబోయే మూడు నెలల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
డేటా రాజధానిగా విశాఖ
రిలయన్స్ తీసుకొస్తున్న భారీ పెట్టుబడి రాష్ట్రానికి గొప్ప సంకేతమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 1,000 మెగావాట్ల హైపర్స్కేల్ డేటాసెంటర్ విశాఖ భవిష్యత్తును మారుస్తుందని, నగరం త్వరలోనే ‘భారత డేటా రాజధాని’ స్థాయికి చేరుతుందని అభిప్రాయపడ్డారు.

