- Home
- Andhra Pradesh
- Andhra pradesh: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు.? ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్
Andhra pradesh: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు.? ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చర్చనీయాంశంగా మారారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి నిత్యం చర్చ జరుగుతుందనే విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ నేత కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీసింది.

కేతిరెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం
వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇట్లూ మీ జాఫర్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మళ్లీ చర్చ
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అనే అంశం చాలాకాలంగా చర్చనీయాంశంగానే ఉంది. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో టీడీపీకి, తారక్కు మధ్య దూరం పెరిగింది. 2014 ఎన్నికల్లో ఆయన ప్రచారం లేకుండానే టీడీపీ అధికారంలోకి వచ్చింది.
2019 ఓటమి తర్వాత బలమైన డిమాండ్
2019 ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొన్న ఘోర పరాజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో పార్టీ పునర్వైభవానికి తారక్ అవసరం అనే వాదన బలంగా వినిపించింది. టీడీపీలోని ఓ వర్గం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో రాజకీయాల నుంచి ఆయన దూరం మరింత పెరిగింది.
జగన్ కోరుకుంటున్నారా.. కేతిరెడ్డి సమాధానం
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు కేతిరెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో 70 నుంచి 80 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నిజమైన వారసుడు ఆయనే అనే భావన కూడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ముఖం అవుతారని, ఆయన వస్తే రాజకీయాలు ఇంత దిగజారేవి కావని జగన్ కూడా భావించి ఉండొచ్చని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక జగన్ కావాలనే టీడీపీలో చీలిక తెచ్చి ఒక వర్గానికి ఎన్టీఆర్ను నాయకుడిని చేయలాని ప్లాన్ చేస్తున్నారా అని జాఫర్ ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కీలక అంచనా
ఇదే ఇంటర్వ్యూలో కేతిరెడ్డి మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీలోని 80 నుంచి 90 శాతం మంది తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారని తెలిపారు. అదే విధంగా బీఆర్ఎస్లోని మెజారిటీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలుపును ఆశిస్తారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లకు వైఎస్ జగన్తో ఉన్న సత్సంబంధాలు దీనికి ప్రధాన కారణమని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి, చంద్రబాబు గురుశిష్యులనే భావన కూడా ఈ ఆలోచనలకు కారణమని పేర్కొన్నారు.

