- Home
- Andhra Pradesh
- Andhra pradesh: మనిషి ప్రాణం తీసిన టీవీ సౌండ్ వ్యవహారం.. భర్తను కత్తితో పొడిచిన భార్య
Andhra pradesh: మనిషి ప్రాణం తీసిన టీవీ సౌండ్ వ్యవహారం.. భర్తను కత్తితో పొడిచిన భార్య
Andhra pradesh: శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదుగుతోన్న మనిషి ఆలోచన తీరు మాత్రం అంతలా మారడం లేదు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. చిన్న చిన్న గొడవలు ఏకంగా ప్రాణాలు తీసేంత వరకు వెళుతున్నాయి.

మంగళగిరిలో విషాదం
గుంటూరు జిల్లా మంగళగిరిలో చిన్న మాట పెద్ద విషాదానికి దారి తీసింది. టీవీ సౌండ్ తగ్గించమన్న కారణంతో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
అసలేం జరిగిందంటే.?
పోలీసుల సమాచారం ప్రకారం, షేక్ అహ్మద్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అతడు కొంతకాలం క్రితం క్రాంతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. క్రాంతికి ఇదివరకే పెళ్లి కాగా, ఆమె మొదటి భర్త జైలులో ఉన్నట్టు సమాచారం. తరువాత అహ్మద్తో కలిసి మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో బీ-16 బ్లాక్లో నివసిస్తున్నారు.
గొడవకు దారి తీసి టీవీ శబ్ధం
గురువారం రంజాన్ ఉపవాసం పాటించిన అహ్మద్ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో టీవీ శబ్దం ఎక్కువగా ఉందని భావించి, సౌండ్ తగ్గించాలని భార్యను కోరాడు. ఈ చిన్న విషయమే మాటామాటకు దారి తీసింది. ఇద్దరి నడుమ మొదలైన వాగ్వాదం పెరిగి తీవ్రంగా మారింది. కొంతసేపటికి పరిస్థితి అదుపు తప్పింది. ఆవేశానికి లోనైన క్రాంతి, ఇంట్లో ఉన్న కత్తితో అహ్మద్పై దాడి చేసింది. పలుమార్లు పొడవడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు… దారిలోనే మృతి
రక్తస్రావంతో కుప్పకూలిన అహ్మద్ను స్థానికులు తొలుత సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
కొనసాగుతోన్న దర్యాప్తు
మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మంగళగిరి పట్టణ సీఐ కె. వీరాస్వామి వివరాలు వెల్లడించారు.

